Begin typing your search above and press return to search.

'మోదీలంతా దొంగలే' ఎఫెక్ట్..కోర్టు మెట్లెక్కిన రాహుల్

By:  Tupaki Desk   |   10 Oct 2019 4:32 PM GMT
మోదీలంతా దొంగలే ఎఫెక్ట్..కోర్టు మెట్లెక్కిన రాహుల్
X
గ్రాండ్ ఓల్డ్ పార్టీగా ప్రసిద్ధికెక్కిన కాంగ్రెస్ పార్టీకి ఆశాకిరణమని అంతా అంటే... అబ్బే అంత పెద్ద బరువు మోయడం తన వంతు కాదంటూ కాడి కింద పడేసిన ఆ పార్టీ యువనేత - ఏఐసీపీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఇప్పుడు పరిస్థితులన్నీ పగబట్టాయనే చెప్పాలి. 2019 ఎన్నికల్లో రాహుల్ ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం చూసింది కదా. 2014 ఎన్నికల్లో కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాకు కాప్తంత దూరంలో ఆగిన కాంగ్రెస్ పార్టీ... 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో అంతకంటే హీనమైన ఫలితాలను చవిచూసింది. ఫలితంగా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్... తనను తాను సేఫ్ సైడ్ లోకి నెట్టేసుకున్నానన్న భావనలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పటికీ ఆయనను వెంటాడుతూనే ఉన్నాయి. ఆ వ్యాఖ్యల ఫలితంగా ఇప్పుడు రాహుల్ గాంధీ తన లైఫ్ లో మరోమారు కోర్టు మెట్లు ఎక్కక తప్పలేదు.

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తనదైన శైలి ప్రచారం చేసిన రాహుల్ గాంధీ... తన ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ వ్యాఖ్యల్లో భాగంగా మహారాష్ట్రలోని సూరత్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా లలిత్ మోదీ - నీరవ్ మోదీ తరహా నేరగాళ్ల పేర్లను ప్రస్తావిస్తూ... దొంగలందరూ తమ పేర్లకు మోదీ అనే ట్యాగ్ ను ఎందుకు తగిలించుకుంటారోనంటూ సంచలనాలకే సంచలనంగా మారిన వ్యాఖ్య చేశారు. నాడు ఈ వ్యాఖ్యలు పెను దుమారమే రేపగా... ఈ వ్యాఖ్య రాహుల్ గాంధీని ఓ వివాదంలోకి నెట్టేసిందనే చెప్పక తప్పదు.

రాహుల్ నోట నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలపై నాడు బీజేపీ భగ్గుమంటే... ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ ఏకంగా రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేశారు. ఎన్నికల హడావిడి - ఆ తర్వాత రెండో సారి బీజేపీ అధికారంలోకి రావడంతో ఈ వ్యాజ్యం పెద్దగా ప్రస్తావనకు రాలేదు. అయితే హడావిడి అంతా అయిపోయింది కదా. రాహుల్ పై పరువు నష్టం వేసిన పూర్ణేశ్ మోదీ... దీనిపై మరోమారు దృష్టి సారించారు. ఈ క్రమంలో పూర్ణేశ్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా తన ముందు హాజరు కావాలని కూడా హుకుం జారీ చేసింది. కోర్టు చిన్నదైనా - పెద్దదైనా... కోర్టే కదా. కోర్టు ముందు అంతా చేతులు కట్టుకుని నిలుచోవాల్సిందే కదా. అందుకే... కోర్టు ఆదేశాల మేరకు గురువారం ఢిల్లీ నుంచి సూరత్ వచ్చిన రాహుల్ గాంధీ కోర్టు ముందు హాజరయ్యారు.