Begin typing your search above and press return to search.

కేసీఆర్ ప్రోగ్రామ్ కే మోడీ.. బీజేపీకి నో

By:  Tupaki Desk   |   28 July 2016 8:20 AM GMT
కేసీఆర్ ప్రోగ్రామ్ కే మోడీ.. బీజేపీకి నో
X
ప్రధాని మోడీ హైదరాబాద్ రానుండడంతో స్థానిక బీజేపీ నేతలు చాలా ఆశలు పెట్టుకున్నారు. పార్టీ పరంగా కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసి అందులో మోడీ పాల్గొనేలా చేయాలని అనుకున్నారు. కానీ.. వారి ఆశలు అడియాశలయ్యాయి. మోడీ ఏ కార్యక్రమంలోనూ పాల్గొనబోరని తేలిపోయింది. ఆయన కేవలం టీఆరెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న మిషన్ భగీరథ పైలాన్ ఆవిష్కరణ మాత్రమే చేస్తారని.. మరే ఇతర కార్యక్రమంలోనూ పాల్గొనబోరని తేలిపోయింది. దీంతో బీజేపీ నేతలు షాకయ్యారు. తొలిసారి తెలంగాణకు వస్తున్న మోడీ ఇక్కడ బీజేపీ శ్రేణులను ఉత్సాహపరిచేలా ఏదైనా కార్యక్రమంలో పాల్గొని ఉంటే బాగుండేదని అంటున్నారు.

ప్రధాని పర్యటన వివరాలను ఆయన కార్యాలయం కొద్దిసేపటి కిందట తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించింది. దాని ప్రకారం ఆయన కేవలం గజ్వేల్ లో మాత్రమే పర్యటిస్తారు. ఇంకెక్కడా పర్యటించారు. కనీసం హైదరాబాద్ లో బేగంపేట విమానాశ్రయం గేటు బయటకు కూడా వచ్చే అవకాశం లేదు. ఈ మేరకు ఇంకే కార్యక్రమాలూ లేవని ప్రధాని కార్యాలయం స్పష్టం చేసింది. ఆగస్టు 7న మిషన్ భగీరథ పైలాన్ ను ఆవిష్కరించేందుకు నరేంద్ర మోదీ ఇప్పటికే అంగీకరించారు. అయితే.. ఆయన రాక సందర్భంగా ఇతర కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ నేతలు అనుకున్నారు. మోడీ మరే అధికారిక కార్యక్రమంలో పాల్గొనేది లేదని పీఎంఓ ఇప్పుడు స్పష్టం చేయడంతో వారంతా షాక్ తిన్నారు.

ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి అందిన సమాచారం మేరకు ఆగస్టు 7న మోడీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో దిగుతారు. వెంటనే అక్కడి నుంచి హెలికాప్టర్ లో గజ్వేల్ వెళ్తారు. అక్కడ నుంచి మళ్లీ బేగంపేటకు వచ్చిఅట్నుంచి అటే ఢిల్లీ విమానమెక్కుతారు. సో... ఆయన గజ్వేల్ తప్ప వేరే ఏ ప్రోగ్రాంలో పాల్గొనే ఛాన్సే కనిపించడంలేదు. అయితే.. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంతో తలపడుతున్న స్థానిక బీజేపీ నేతలు తమ నేత తమను పట్టించుకోకుండా కేసీఆర్ ను పట్టించుకోవడమేంటని అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.