Begin typing your search above and press return to search.

మీడియాకే బిస్కెట్ వేసిన మోడీ

By:  Tupaki Desk   |   5 Aug 2015 5:23 AM GMT
మీడియాకే బిస్కెట్ వేసిన మోడీ
X
రెండు వారాలుగా పార్లమెంట్‌ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. భూసేకరణ చట్టం విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. సమావేశాలు సజావుగా జరగడానికి ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేయాల్సిన పరిస్థితొచ్చింది. ఎంపీలను సస్పెండ్ చేసిన తర్వాత ప్రతిపక్షం మరింత దూకుడు పెంచింది. ఈ హడావుడి ఇలా ఉండగానే మోడీ ట్విటర్ అకౌంట్‌ లో ఓ బ్రేకింగ్‌ న్యూస్‌ కనిపించింది. @ఈ రోజు సాయంత్రం ఆరున్నర గంటలకు స్పెషల్‌ అనౌన్స్‌ మెంట్‌ చేయబోతున్నాను. ల్యాండ్‌ మార్క్‌ ఈవెంట్‌ ని చూడబోతున్నాం @అని ట్వీట్‌ వదిలి మోడీ ఊరించారు. అసలే ల్యాండ్‌ బిల్‌ పై రగడ జరుగుతున్న టైమ్‌ లో మోడీ సంధించిన ట్విటర్‌ అస్త్రం మీడియాలో బ్రేకింగ్‌ న్యూసైంది. నేషనల్‌ న్యూస్‌ ఛానళ్లన్నీ మోడీ ల్యాండ్‌ బిల్‌ పై మాట్లాడతారంటూ ఊహాగానాలను ప్రసారం చేయడం మొదలుపెట్టాయి. కాసేపట్లో మోడీ మీడియా ముందుకు రాబోతున్నారంటూ హడావుడి చేశాయి. ట్విటర్లో మోడీని ఫాలో అవుతున్న వాళ్లైతే ఓ రేంజ్‌ లో రియాక్టయ్యారు. మోడీ ట్వీట్‌ కి రీట్వీట్‌ చేస్తూ ఏవేవో ఊహించుకున్నారు.జోకులేశారు. కొందరైతే ఉత్కంఠను ఆపుకోలేకపోయారు.

టైం గడుస్తున్నకొద్దీ అందర్లో ఒకటే ఉత్సుకత. ఆరున్నరకు మోడీ ఏం మాట్లడతారు? ప్రతిష్టంభన నెలకొన్న ల్యాండ్‌ బిల్‌ పైనే మాట్లాడతారా? బిల్లుపై నేరుగా మోడీనే ప్రకటన చేయబోతున్నారా? అందరిలో ఇవే ప్రశ్నలు. ఆరున్నర దాటింది. లైవ్‌ వ్యాన్‌ లు సిద్ధమయ్యాయి. కెమెరాలు క్యూకట్టాయి. ఛానళ్లల్లో అప్పటికే ఉన్న ప్రోగ్రామ్‌ లను ఆపేసి పీఎంఓ కెమెరాకి కనెక్షన్‌ ఇచ్చేసి సిద్ధంగా ఉన్నారు. ఇంతలో మోడీ రానే వచ్చారు. తీరా చూస్తే వేదికపైన నేషనలిస్ట్‌, సోషలిస్ట్‌ ఆఫ్‌ నాగాలాండ్‌ ప్రతినిధులు కనిపించారు.

అప్పటికీ ఛానళ్లకు ఇంకా అర్థం కాలేదు. ల్యాండ్‌ బిల్లుపైనే మోడీ ప్రకటన చేయబోతున్నారంటూ బ్రేకింగ్‌ న్యూస్‌ వస్తూనే ఉంది. అయితే కాసేపటికి అది నాగాలాండ్‌ తిరుగుబాటుదారులతో శాంతి ఒప్పందం కుదుర్చుకునే కార్యక్రమం అని అర్థమైంది. అప్పటిదాకా ఉత్కంఠతో చూసిన మీడియా ప్రతినిధులు ఈ కార్యక్రమం చూసి భారంగా నిట్టూర్చారు. మోడీ ఊరించి ఊరించి తుస్సుమనిపించేశారని సెటైర్లు వినిపించాయి. ల్యాండ్‌ మార్క్‌ ఈవెంట్‌ అంటే ల్యాండ్‌ బిల్లు పై మాట్లాడతారేమో అనుకుంటే... శాంతి ఒప్పందం గురించి ఇంత బిల్డప్‌ ఇచ్చారా అని అనుకున్నారు. సాయంత్రం ఆరున్నరకు ఏమవుతుందా అని ఎదురుచూసిన వాళ్లలోనూ ఇదే నిరాశ.

ఆరున్నరకు టీవీ ఆన్‌ చేస్తే... శాంతి ఒప్పందంపై సంతకాలు పెట్టి ఓ స్పీచ్‌ ఇచ్చి వెళ్లిపోయారు మోడీ. మొత్తానికి మోడీ మీడియాను భలే ఆడుకున్నాడని అనుకున్నారంతా. మీడియాను వాడుకోవడంలో, తనకు కావాల్సినట్టు ప్రచారం కల్పించుకోవడంలో మోడీ స్పెషలిస్ట్‌ అంటారు. వాడుకోవడంలోనే కాదు... ఆడుకోవడంలోనూ తాను స్పెషలిస్టేనని నిరూపించారు మోడీ.