Begin typing your search above and press return to search.

ఏపీకి మోడీ సర్కారు చేసిన లెక్క చూశారా?

By:  Tupaki Desk   |   27 May 2016 4:35 AM GMT
ఏపీకి మోడీ సర్కారు చేసిన లెక్క చూశారా?
X
విభజన నేపథ్యంలో భారీగా నష్టపోయిన ఏపీకి ఏన్నో చేస్తామంటూ విభజన బిల్లు సందర్భంగా హామీల మీద హామీలు చేశారు. కొన్నింటిని విభజన బిల్లులో ప్రస్తావిస్తే.. మరికొన్నింటిని నోటిమాటగా చెప్పారు. పార్లమెంటు సాక్షిగా దేశ ప్రజలంతా వినేటట్లు చెప్పిన మాటల్ని నమ్మకుండా ఎలా ఉంటామన్న భావనతో సీమాంధ్రకు చెందిన పలువురు నేతలు కామ్ గా ఉండిపోయారు. విభజన చట్టంలో పేర్కొన్న పలు హామీలనే నెరవేర్చని మోడీ సర్కార్.. నోటి మాటగా ఇచ్చిన హామీల విషయంలో లైట్ అన్నట్లు వ్యవహరించటం తెలిసిందే.

విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన కీలక హామీల్లో ఒకటి ప్రత్యేక హోదా. ఆ విషయంలో మోడీ సర్కారు ఇప్పటికే చేతులెత్తేయటమే కాదు.. ప్రత్యేక హోదా కారణంగా ఒరిగేది ఏమీ ఉండదన్న మాటను తరచూ చెబుతున్నారు. గడిచిన రెండేళ్ల వ్యవధిలో ఏపీకి చాలానే చేసినట్లుగా మోడీ బ్యాచ్ అదే పనిగా మాటలు చెబుతోంది. అందుకు భిన్నమైన వాదనను ఏపీ అధికారపక్షం చేస్తోంది. ఈ నేపథ్యంలో విభజన చట్టం సందర్భంగా ఇచ్చిన హామీలేంటి? మోడీ సర్కారు చేసిందేమిటన్నది కాస్త కన్ఫ్యూజన్ గా మారిన పరిస్థితి.

ఈ నేపథ్యంలో.. విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన హామీలు.. మోడీ సర్కారు ఏం చేశారు? ఏం చేయలేదన్న ఒక లెక్కను ఏపీ అధికారపక్షం రెఢీ చేసింది. మోడీ బ్యాచ్ చెప్పే మాటలకు చేతలకు ఏ మాత్రం సంబంధం లేదన్న విషయం తాజాగా లెక్కతో స్పష్టత రావటం ఖాయమంటున్నారు. తిరుపతిలో నిర్వహిస్తున్న మూడురోజుల మహానాడు సందర్భంగా ఈ లెక్కలపై పార్టీ నేతలు.. కార్యకర్తలకు పూర్తి అవగాహన కలిగేలా చేయనున్నారు. ఈ సమాచారంతో ఏపీకి మోడీ సర్కారు ఏం చేసింది.. ఏం చేయలేనిదన్న విషయాలపై మరింత స్పష్టతతో మాట్లాడే వీలు ఉండనుంది.

విభజన హామీల అమలులో ఏపీకి మోడీ సర్కారు ఏం చేశారు.. ఏం చేయలేదన్న విషయాల్లోకి వెళితే..

= ఐదేళ్లు ప్రత్యేక హోదా; విభజన చట్టంలో లేదంటూ తూచ్ అనేసి.. అవసరం లేదని పార్లమెంటులో ప్రకటించారు

= ఆర్థిక లోటు; కాగ్ ఓకే చేసి లోటు మొత్తం రూ.16,079 కోట్లకు ఇప్పటికి ఇచ్చింది రూ.2803 కోట్లే. అది కూడా 2014-15కు సంబంధించింది.

= పోలవరం ప్రాజెక్ట్; జాతీయ ప్రాజెక్టుగా చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం ఏపీ సర్కారు పెట్టిన ఖర్చులో రూ.1472 కోట్లను ఇప్పటికి ఇవ్వలేదు

= రాజధాని అమరావతి; 20 ఏళ్లలో రూ.1.20 లక్షల కోట్లు అవసరమని అంచనా. కానీ.. ఇప్పటికి ఇచ్చింది రూ.2050 కోట్లు మాత్రమే

= వెనుకబడిన ప్రాంతాలకు బుందేల్ ఖండ్ ప్యాకేజ్; రెండేళ్లలో ఏడు జిల్లాలకు ఇచ్చింది రూ.700 కోట్లే

= కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు.. పరిశోధన కేంద్రాల ఏర్పాటు; బడ్జెట్ కేటాయింపులు చాలా చాలా తక్కువ

= పారిశ్రామిక అభివృద్ధికి పన్ను సహా రాయితీలు; ప్రకటన వచ్చినా ఇప్పటికి అమల్లోకి మాత్రం ఇంకా రాలేదు

= 9.. 10 షెడ్యూళ్లలోని సంస్థల విభజన; ఇంకా పూర్తి కాలేదు

= ఉద్యోగుల విభజన; ఇంకా పూర్తి కాలేదు

= రెండు రాష్ట్రాల జలవివాదాల పరిష్కారం.. కొత్త ప్రాజెక్టులు; అపెక్స్ కౌన్సిల్ ను ఇంకా ఏర్పాటు చేయలేదు

= విశాఖకు రైల్వే జోన్ ; ఇప్పటివరకూ స్పష్టమైన మాట చెప్పటం లేదు

= కడపలో స్టీల్ ఫ్లాంట్ ఏర్పాటు; ఆ ఊసే లేదు