Begin typing your search above and press return to search.

బాల‌య్య‌కు షాక్ ఇవ్వ‌నున్న మిథున్ రెడ్డి

By:  Tupaki Desk   |   22 Nov 2017 2:06 PM GMT
బాల‌య్య‌కు షాక్ ఇవ్వ‌నున్న మిథున్ రెడ్డి
X
రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో? నేత‌లు ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారో చెప్ప‌డం క‌ష్టం!! 2019 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్న విప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఆదిశ‌గా తీసుకుంటున్న నిర్ణ‌యాలు అంద‌రినీ షాక్‌కు గ‌రిచేస్తున్నాయి. ప్ర‌స్తుతం ఆయ‌న చేస్తున్న ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర ఓ సంచ‌ల‌న‌మైతే.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి టిక్కెట్ల నిర్ణ‌యం కూడా జ‌రిగిపోతుండ‌డం మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యంగా మారింది. వాస్త‌వానికి ఎన్నిక‌లు ఆరేడు నెల‌లు ఉన్నాయ‌న‌గా ఏ రాజ‌కీయ పార్టీ అయినా అభ్య‌ర్థులు - టిక్కెట్ల‌పై దృష్టి పెడుతుంది. కానీ, వైసీపీ అధినేత ఈ విష‌యంలో మ‌రింత `దూర‌దృష్టి`తో ముందుకు వెళ్తున్నారు. గెలుపు గుర్రాల‌కు అవ‌కాశం ఇవ్వ‌డంతోటే స‌రిపెట్ట‌డం లేదు. ప్ర‌త్య‌ర్థి ప‌క్షంలో బ‌లంగా ఉన్న నేత‌ల‌కు చెక్ పెట్ట‌గ‌ల నేత‌ల‌ను కూడా ఒడిసిప‌డుతున్నారు. అలాంటి వారిని ప్రోత్స‌హించ‌డం ద్వారా గెలుపును త‌న‌కు ఏక‌ప‌క్షం చేసుకోవాల‌ని జ‌గ‌న్ వేస్తున్న వ్యూహాలు అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తుతున్నాయి.

తాజాగా వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో హ‌ల్ చ‌ల్ చేస్తున్న ఓ స‌మాచారం మీడియాకు లీకైంది! జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి టీడీపీకి బ‌ల‌మైన నేత‌గా ఉన్న సీం చంద్ర‌బాబు వియ్యంకుడు - నటుడు బాల‌కృష్ణ‌కు చెక్ పెట్టే బాధ్య‌త‌ను అప్ప‌గించార‌ట‌. 2019 లేదా అంత‌కు ముందు వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాల‌కృష్ణ తిరిగి హిందూపురం నుంచి బ‌రిలోకి దిగే ఆలోచ‌న చేస్తున్నందున ఆయ‌న‌పై బ‌ల‌మైన నేత‌ల‌ను నిల‌బెట్టి, గెలిపించే బాధ్య‌త‌ను కూడా మిథున్ రెడ్డికి జ‌గ‌న్ అప్ప‌గించార‌ని స‌మాచారం. వాస్త‌వానికి గ‌త 2014 ఎన్నిక‌ల్లో హిందూపురంలో టీడీపీ త‌ర‌ఫున బాల‌య్య బ‌రిలో దిగ‌గా.. వైసీపీ ప‌క్షాన నవీన్ నిశ్చల్ పోటీ చేశారు. అయితే, అప్ప‌టి ఎన్నిక‌ల్లో బాల‌య్య‌ను ఓడించ‌లేక పోయారు.

కానీ, వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం ఎట్టిప‌రిస్థితిలోనూ హిందూపురాన్ని వైసీపీ ఖాతాలో వేసుకోవ‌డం ద్వారా.. టీడీపీ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు అవుతుంద‌ని జ‌గ‌న్ ప‌క్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే మిథున్ రెడ్డి స‌రైన అభ్య‌ర్థిని ఎంపిక చేసి బాల‌య్య‌పై బ‌రిలో దింపేలా సూచించార‌ట‌. వాస్త‌వానికి హిందూపురంలో 2014 ఎన్నికలో్ల‌ వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన నవీన్ నిశ్చల్ బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. అయితే హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వాల్మీకి బోయ సామాజిక వర్గం గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ క్ర‌మంలోనే టీడీపీలో ఉన్న వాల్మీకీ బోయ సామాజిక వర్గానికి చెందిన నేతను వైసీపీలో చేర్పించి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దింపాలని జ‌గ‌న్ భావించారు. ఈ బాధ్య‌త‌ను మిథున్‌రెడ్డికే అప్ప‌గించార‌ట జ‌గ‌న్‌.

ఇక‌, ఇదేస‌మ‌యంలో.. 2019 ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్టు దక్కకపోతే నవీన్ నిశ్చల్ ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది. అయితే సామాజిక సమీకరణాలు కూడ గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున నవీన్ నిశ్చల్‌ స్థానంలో వాల్మీకి బోయ సామాజిక వర్గం అభ్యర్థిని బరిలోకి దింపాలని వైసీపీ ప్లాన్ చేస్తోందని ప్రచారం. అదే జరిగితే నవీన్ నిశ్చల్ వైసీపీలోనే కొనసాగుతారా... లేదా అనేది కూడ ఆసక్తికరంగా మారింది. ఇక‌, జ‌గ‌న్ ఆదేశాల‌తో మిథున్ రెడ్డి ఇప్ప‌టికే అభ్య‌ర్థి వేట‌లో ప‌డ్డార‌ని, టీడీపీ నేత‌ల‌తో తెర‌చాటుగా మంత‌నాలు జ‌రుపుతున్నార‌ని స‌మాచారం. బాల‌య్య‌ను దీటుగా ఎదుర్కొనే నేత దొర‌క‌డ‌మే ఆల‌స్యంగా మిథున్ రెడ్డి చ‌క్రం తిప్పుతున్న‌ట్టు స‌మాచారం.