Begin typing your search above and press return to search.

పాక్ జ‌ర్న‌లిస్టును క‌డిగేసిన మిథాలీ!

By:  Tupaki Desk   |   23 Jun 2017 1:20 PM GMT
పాక్ జ‌ర్న‌లిస్టును క‌డిగేసిన మిథాలీ!
X
భార‌త మ‌హిళల క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ మైదానం వెలుప‌ల కూడా సిక్స‌ర్ల మోత మోగించింది. ఓ జ‌ర్న‌లిస్టు అడిగిన తిక్క‌ ప్ర‌శ్న‌కు త‌న‌దైన శైలిలో బ్యాట్‌ తో కాకుండా మాట‌ల‌తో స‌మాధాన‌మిచ్చింది. మిథాలీ శివంగిలా రెచ్చిపోవ‌డంతో ఓకే ఓవ‌ర్లో ఆరు సిక్స‌ర్లు కొట్టిచ్చుకున్న బౌల‌ర్లా అయిందా జ‌ర్న‌లిస్టు ప‌రిస్థితి.

ఇంగ్లండ్ వేదికగా రేపటి నుంచి ఐసీసీ మహిళా వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ సంద‌ర్భంగా అన్ని జట్ల కెప్టెన్లకు ఐసీసీ విందు ఏర్పాటు చేసింది. దాని త‌ర్వాత జరిగిన మీడియా స‌మావేశంలో మిథాలీ రాజ్ ను పాకిస్థాన్ కు చెందిన ఒక జర్నలిస్టు భారత్ - పాకిస్థాన్ ఆటగాళ్లలో మీకు ఎవరంటే ఇష్టం? అని అడిగారు. ఈ ప్ర‌శ్న‌తో మిథాలీకి చిర్రెత్తుకొచ్చింది. ఆ విలేక‌రిపై ప్ర‌శ్న‌ల బాణాలు సంధించింది. ఇదే ప్ర‌శ్న‌ ఎవరైనా మ‌గ క్రికెటర్ ను అడగగలరా? 'రెండు దేశాలకు చెందిన ఏ క్రికెటర్ నైనా మీకు ఏ జట్టులోని మహిళా క్రికెటర్ ఇష్టమని అడిగారా?' అంటూ నిలదీసింది.

ఈ రివ‌ర్స్ క్వ‌శ్చ‌న్స్‌తో ఆ విలేకరి బిత్తరపోయాడు. ఊహించని ప్రశ్నలు ఎదురు కావడంతో బిక్క మొహం వేశాడు. రెండు దేశాల్లో పురుషుల క్రికెట్ కు ఒకలాంటి ఆదరణ లభిస్తే, మహిళల క్రికెట్ కు మరో రకమైన ఆదరణ లభిస్తుందని మిథాలీ తెలిపింది.

కొంత‌కాలం క్రితం వ‌ర‌కు లైవ్ ప్రసారాలు ఉండేవి కాదని, ఇప్పుడు బీసీసీఐ సోషల్ మీడియా ద్వారా లైవ్ లో మ్యాచ్ లను ప్రసారం చేస్తే, టీవీలలో కూడా వస్తున్నాయని ఆమె తెలిపింది. అయితే ఊహించని ఆదరణ సొంతం చేసుకోలేకపోతున్నాయని మిథాలీరాజ్ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తుషార్ అరోద్ జట్టుకి కోచ్ గా వ్యవహరిస్తున్నారని, ఆయన నేతృత్వంలో జట్టు మంచి ఫలితాలు సాధిస్తోందని ఆమె హర్షం వ్యక్తం చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/