Begin typing your search above and press return to search.

నాగంను బుజ్జ‌గించేందుకు కేంద్ర‌మంత్రి ఎంట్రీ

By:  Tupaki Desk   |   23 Jan 2018 9:16 AM GMT
నాగంను బుజ్జ‌గించేందుకు కేంద్ర‌మంత్రి ఎంట్రీ
X
మాజీ మంత్రి - బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నాగం జనార్ధన్‌ రెడ్డి కొన్ని రోజుల నుంచి బీజేపీని వదిలి ఇతర పార్టీలోకి వెళుతున్నారని, సొంత పార్టీ పెడుతున్నారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ పనితీరుపై కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలపై కార్యకర్తలలో అనుమానాలున్నాయని బహిరంగంగా నాగం అసంతృప్తిని వెలిబుచ్చారు. అలాగే ఉగాది తరువాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని స్పష్టం చేశారు. దీంతో కొన్ని రోజులనుంచి బీజేపీని నాగం వీడనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించేందుకు నాగం స్థాపించిన తెలంగాణ నగారా సమితిని స్థాపించి రాష్టవ్య్రాప్తంగా పర్యటించి మలిదశ ఉద్యమంలో కీలకపాత్రను పోషించారు. బీజేపీతోనే తెలంగాణ సాధ్యమని భావించి అప్పటి బీజేపీ అధ్యక్షుడు రాజ్‌ నాథ్‌ సింగ్ సమక్షంలో హైదరాబాద్‌ లో జరిగిన భారీ బహిరంగసభలో నాగం జనార్ధన్‌ రెడ్డి బీజేపీలో చేరడంతోపాటు నగారా సమితిని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటినుంచి రాజ్‌ నాథ్‌ సింగ్‌ కు నాగంతో మంచి సంబంధాలు నెలకొన్నాయి. బీజేపీలో జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్న నాగం జనార్ధన్‌ రెడ్డికి రాష్ట్ర విభాగంలో తగిన ప్రాధాన్యతను ఇవ్వడంలేదని, తన రాజకీయ అనుభవాన్ని పార్టీ ఉపయోగించుకోవడం లేదనే భావన నాగంలో నెలకొంది. పైగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆయనను తీవ్ర మనోవేదనకు గురిచేశాయి. దీనితో తీవ్ర అసంతృప్తితో ఉన్న నాగం జనార్ధన్‌ రెడ్డి ఉగాది తరువాత బీజేపీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం కొనసాగుతోంది.

బీజేపీలో పనిచేసే వారికి సరైన ప్రాధాన్య ఇవ్వడంలేదని, రాష్ట్ర నాయకత్వం అధికార పార్టీ తీరుపై మెతక వైఖరి అవలంబిస్తోందని - కిందిస్థాయి కార్యకర్తలు బీజేపీ పనితీరుపై అసంతృప్తితో ఉన్నారని చెబుతూ పార్టీ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న నాగం జనార్ధన్‌ రెడ్డిని బుజ్జగించేందుకు కేంద్ర నాయకత్వం శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి చెందిన కొందరు బీజేపీ సీనియర్ నాయకులు నాగంతో చర్చలు జరుపగా పార్టీ పనితీరుపై నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తూ పలు అంశాలపై కుండబద్దలు కొట్టినట్లు చెప్పి నిలదీసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం అఫెర్స్ సహాయ మంత్రి హన్స్‌ రాజ్ గంగారాం అయ్యర్ నాగం జనార్ధన్‌ రెడ్డి స్వగృహానికి వచ్చి నాగం జనార్ధన్‌ రెడ్డితో అంతర్గతంగా చర్చలు జరిపారు.

కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌ నాథ్ సింగ్ దూతగానే కేంద్ర హోం అఫెర్స్ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారం అయ్యర్ హైదరాబాద్‌ కు వచ్చి నాగంతో చర్చలు జరిపివెళ్లినట్లు తెలుస్తుంది. వీరిద్దరి మధ్య ఏవిధమైన చర్చలు జరిగాయో తెలియడంలేదు. కాని, మరో వారం రోజులలో కేంద్ర నాయకత్వం నుంచి నాగంకు పిలుపువస్తుందనే నమ్మకంతో ఆయన అనుచరులు ఉన్నారు. హైదరాబాద్‌ లోని నాగం జనార్ధన్‌ రెడ్డి స్వగృహానికి వచ్చిన కేంద్ర హోంఅఫెర్స్ సహాయ మంత్రిని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నాగం జనార్ధన్‌ రెడ్డి సన్మానించి జ్ఞాపికను అందచేశారు.