Begin typing your search above and press return to search.

చినబాబు పరువు కోసం ఖజానాపై భారం

By:  Tupaki Desk   |   12 Jan 2018 3:02 PM GMT
చినబాబు పరువు కోసం ఖజానాపై భారం
X
ఏపీ ప్రభుత్వంలో చినబాబు లోకేష్ బాబు పరువు కాపాడడం ఇప్పుడు ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం. అందుకోసం అసలే అంతంత మాత్రంగా ఉన్న ఖజానా మీద అదనపు భారం మోపడానికి - అప్పులు చేసి తెస్తున్న సొమ్ములు తగలేయడానికి అయినా వారు సిద్ధం. పైపెచ్చు.. పొరుగు రాష్ట్రం తెలంగాణ నుంచి అక్కడి సీఎం తనయుడు కేటీఆర్ కు ఒక గౌరవం దక్కుతున్న నేపథ్యంలో.. అదే మాదిరి గౌరవం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సీఎం తనయుడు లోకేష్ బాబు కు దక్కకపోతే అపర్దిష్ట కదా. అందుకే మరి.. మన జేబు.. సారీ - ఖజానాలోంచి డబ్బు తగలేసి అయినా సరే.... గౌరవాన్ని కొనుక్కోవాలి! ఇదీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం లెక్కగా ఉంది. అందుకే భారీ మొత్తాల్లో డబ్బు వృథా చేయబోతున్నారు.

దావోస్ లో జరగబోతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెళ్లడం లేదు. ప్రతిసారీ దావోస్ సదస్సుకు చంద్రబాబు వెళ్లడం అనేది ఒక రివాజుగా మారిపోయింది. అక్కడ స్టాల్ లో కూర్చుని... ఏపీని ప్రమోట్ చేస్తున్నట్లుగా ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అవుతున్నట్లుగా చెప్పుకోవడం తప్ప.. ఇప్పటిదాకా ఒరిగింది మాత్రం ఏమీ లేదు. అయితే ఈసారి దావోస్ లో సదస్సుకు చంద్రబాబు వెళ్లడం లేదు. ఆయన స్థానంలో లోకేష్ వెళ్తున్నారు. కానీ లోకేష్ కు ఆహ్వానం లేదని సమాచారం. మరేం చేయాలి. దావోస్ లో ఐటీ రంగానికి గ్రామీణాభివృద్ధికి ముడిపెడుతూ ఓ సెమినార్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే స్పాన్సర్ చేయడానికి సిద్ధపడింది. స్పానరర్ గా ఆ కార్యక్రమానికి లోకేష్ వెళ్లాల్సిందే కదా..! ఆ రకంగా లోకేష్ దావోస్ అవకాశం కోసం.. దావోస్ లో సెమినార్ ను స్పాన్సర్ చేసే భారాన్ని ఖజానా మీద వేస్తున్నారన్నమాట.

ఇదంతా ఎందుకు? అక్కడేమో తెలంగాణ మంత్రి - యువరాజు కేటీఆర్ కు దావోస్ నుంచి అధికారిక ఆహ్వానం అందింది. ఆయన వెళ్లి ఏపీ చినబాబు వెళ్లకపోతే... తేడా వొచ్చేస్తుంది గనుక.. ఈ దారి తొక్కారు. ‘‘అవకాశం దానంతట అది రానప్పుడు ఏం చేయాలి.. మనమే అవకాశాల్ని సృష్టించుకోవాలి’’ అని పర్సనాలిటీ డెవలప్ మెంట్ లో ఓ సిద్ధాంతం చెబుతారు. ఇప్పుడు లోకేష్ కూడా అదే చేస్తున్నారు. కాకపోతే.. తన అవకాశాల్ని ఏపీ సర్కారు డబ్బుతో సృష్టించుకుంటున్నారు.