Begin typing your search above and press return to search.

పవ‌న్‌పై ప‌రువునష్టం..లోకేష్ తాజా అస్త్రం

By:  Tupaki Desk   |   20 March 2018 10:40 AM GMT
పవ‌న్‌పై ప‌రువునష్టం..లోకేష్ తాజా అస్త్రం
X
జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత‌ పవన్ కల్యాణ్ ఏపీ మంత్రి లోకేష్‌ ను ఉద్దేశించి అవినీతి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. లోకేష్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నార‌ని, ఆయ‌న తాత ఎన్టీఆర్ పేరుకు చెడ్డ‌పేరు వ‌చ్చేలా చేస్తున్నార‌ని ఆరోపించారు. అంతేకాకుండా ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ న‌ల‌భై మంది ఎమ్మెల్యేలు త‌న‌కు లోకేష్ అవినీతి గురించి చెప్పార‌ని ప‌వన్ పేర్కొన్నారు. అయితే ఈ ప‌రిణామాల‌కు ఇప్ప‌టివ‌ర‌కు లోకేష్ స్వ‌యంగా స్పందించ‌లేదు.

తాజాగా ప‌వ‌న్ విమ‌ర్శ‌ల‌పై మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స్పందించిన మంత్రి లోకేశ్‌.. తాము ప్ర‌తి రోజూ రాత్రి 11 గంట‌ల వ‌ర‌కూ క‌ష్ట‌ప‌డుతున్నామ‌ని.. రాజ‌ధాని లేని రాష్ట్రాన్ని కేరాఫ్ అడ్ర‌స్ గా ఇచ్చార‌ని.. సీఎం అంత‌గా క‌ష్ట‌ప‌డుతుంటే రెండున్న‌ర మార్కులు వేస్తారా? అంటూ ఫైర్ అయ్యారు. త‌న‌పై ప‌వ‌న్ చేసిన ఆరోప‌ణ‌లు.. త‌ర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఎవ‌రో చెబితే చేశాన‌ని ప‌వ‌న్ చెప్ప‌టంపై లోకేశ్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

పవన్‌ కల్యాణ్‌ పై పరువు నష్టం దావా వేసే అంశాన్ని పార్టీ నిర్ణయిస్తుంది లోకేష్ తెలిపారు. ‘ఏపీ ప్రజలు తెలివైన వారు...ఎవరేంటో వాళ్లకు తెలుసు...పవన్ సర్టిఫికెట్ మాకు అవసరం లేదు’ అంటూ వ్యాఖ్యానించారు. దిగజారుడు రాజకీయాలు విచారకరమని ఆరోపించారు. త‌న‌తో ఫొటోలో ఉంది ప్లానింగ్ కమిషన్ సభ్యుడు పెద్ది రామారావు అని పేర్కొంటూ పెద్ది రామారావును శేఖర్‌ రెడ్డి అని చెబుతున్నారని లోకేష్ ఆరోపించారు. ప్రతి ఏటా ఆస్తులు ప్రకటిస్తున్నాన‌ని లోకేష్ వెల్ల‌డించారు. `చిల్లిగవ్వ ఎక్కువ ఉన్నా తీసుకోండి.., అప్పుడు జగన్ - ఇప్పుడు పవన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారు` అని లోకేష్ మండిపడ్డారు. అసత్య ఆరోపణలు చేసి పార్టీ ప్రతిష్టను దెబ్బతీసిన పవన్‌ కల్యాణ్‌ పై పరువు నష్టం దావా వేయాలని కొందరు నేతలు సూచించారు. పరువు నష్టం దావా అంశాన్ని పార్టీ నిర్ణయిస్తుందని లోకేష్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.

పవన్ దగ్గర నిజంగా ఆధారాలుంటే ఒక్క రోజులోనే మాట ఎలా మారుస్తార‌ని లోకేష్ వ్యాఖ్యానించారు. `పవన్ కళ్యాణ్ దగ్గర నా ఫోన్ నంబర్ ఉంది కదా నాకే ఫోన్ చేయొచ్చు కదా? అని గుర్తుచేశారు. తాను తాతకు చెడ్డ పేరు తెస్తున్నానని ఆరోపణలు చేయడం బాధ కలిగించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను పుట్టే నాటికే తన తాత సీఎం అని, చాలా పద్దతిగా క్రమశిక్షణతో పెరిగిన వాడినని తెలిపారు.