Begin typing your search above and press return to search.

కవితక్కకే కొరుకుడుపడని ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   10 Feb 2016 9:51 AM GMT
కవితక్కకే కొరుకుడుపడని ఎమ్మెల్యే
X
'శంభో.. శివ శంభో' సినిమా చూశారా? అప్పుడెప్పుడో వచ్చిన సినిమాతో ఇప్పడేం పని అనుకోవద్దు. ఆ సినిమాలో కృష్ణ భగవాన్ ఒక ఫన్నీ క్యారక్టర్ లో నటించారు. ఊళ్లో చిన్నచితకా మంచిపనులు - సహాయాలు చేసే కృష్ణభగవాన్ ఆ పనులు చేసిన వెంటనే తన నిలువెత్తు చిత్రాలతో క్షణాల్లో దాన్ని సొంత ప్రచారానికి వాడుకుంటారు. ఇప్పుడు నిజామాబాద్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా కూడా ప్రచారంలో అదే స్టైల్ ఫాలో అవుతున్నారట. ప్రజాప్రతినిధి అన్న తరువాత ప్రచారం చేసుకుంటారు.. అందులో తప్పేముంది అనుకోవచ్చు. కానీ, కేసీఆర్ కుమార్తె - నిజామాబాద్ ఎంపీ కవితకు మాత్రం అందులో తప్పులు కనిపిస్తున్నాయి. కారణం... ఆమె పేరు కానీ, ఫొటో కానీ పెట్టకుండా ప్రతి పనినీ గణేశ్ తన క్రెడిట్ లోనే వేసుకుంటుండడంతో ఆమెకు ఏం చేయాలో తోచడం లేదట. గణేశ్ ను ఎలా కంట్రోల్ చేయాలో తెలియక ఆమె తన మనసులో బాధను మిగతా నాయకుల వద్ద వ్యక్తం చేస్తున్నారట.

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా వన్ మేన్ షో దెబ్బకు ఆ జిల్లాలోని ప్రజాప్రతినిధులు - అధికారులతో పాటు నిజామాబాద్ ఎంపీ కవిత కూడా షాక్ తింటున్నారు జిల్లా కేంద్రమైన నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఆయ‌న తన నియోజకవర్గంలో ఏ పథకం.. పని అమల్లోకి వచ్చినా కూడా అదంతా తన ఒక్కడి పుణ్యమే అని ప్రచారం చేసుకుంటున్నారు. భారీ ఫ్లెక్సీలు - హోర్డింగులతో మొత్తం క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకుంటున్నారట. నిజామాబాద్ నగరంలోనే ఉంటున్న ఎంపీ కవిత - ఆ జిల్లాకు చెందిన మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పేర్లను ఆ ప్రచారంలో ఎక్కడా కనపడనివ్వడం లేదట.

అంతేకాదు... నిజామాబాద్ నగరంలో కోట్లాది రూపాయలతో చేపడుతున్న ప్రగతి పనుల ప్రారంభోత్సవాలకు గణేష్‌ గుప్తా ఎవరినీ పిలవడం లేదట. కవితకు సమాచారం కూడా ఇవ్వడం లేదట. నిజామాబాద్ మేయర్ ఆకుల సుజాతతో సహా కార్పొరేషన్ అధికారులను తన గుప్పిట్లో పెట్టుకుని ఆయన పరిపాలన సాగిస్తున్నారని కవిత రగిలిపోతున్నారు. రిబ్బన్ కటింగ్ అయినా, కొబ్బరికాయ కొట్టడమైనా అది గణేశ్ ఒక్కరే పూర్తిచేస్తున్నారు.

గణేశ్ ను ఎలా ఎదుర్కోవాలో తెలియక కవిత తెగ బాధపడుతున్నారట. చివరకు ఒకసారి ఆమె... గుప్తాకు కౌంటర్ ఇచ్చేందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పథకంపై రాష్ట్రస్థాయి అధికారులను పిలిపించి కార్యాచరణ మొదలెట్టారు. కార్పొరేషన్ అధికారులను, కార్పొరేటర్లను పిలిచి ఆమె ఆ ప‌థ‌కం త‌న క్రెడిట్ అని చెప్పుకునే ప్రయ‌త్నం చేశారు. ఇంకోసారి. న‌గ‌రంలో నీటి ఎద్దడి నివారణకు అధికారులతో సమావేశాలు పెట్టి తన హవా చూపించే ప్రయత్నం చేశారు. అధికారులను కదలించి నీటి ఎద్దడి రాకుండా పనులు చేయించారు కూడా. అయితే... తీరా నగరానికి నీరందించే అలీసాగర్‌ జలాశయంలోకి నీరు చేరిన వెంటనే ఎమ్మెల్యే గణేష్‌ గుప్తా అదంతా తన ఖాతాలో వేసుకున్నారు. ఆ మరునాడు ఉదయాన్నే నగరంలో కారులో వెళ్తున్న కవితకు ఎక్కడ చూసినా గణేశ్ ఉన్న భారీ ఫ్లెక్సీలే కనిపించాయి. నగర ప్రజల దాహార్తిని తీర్చిన అపర భగీరథుడంటూ పోస్టర్లు కనిపించడంతో ఆమెకు నోట మాటరాలేదట. ఆ పోస్టర్లలో కవిత ఫొటో కాదు కదా... పేరు కూడా కనిపించలేదట.

సాక్షాత్తు ముఖ్యమంత్రి కుమార్తె విషయంలోనే సొంత పార్టీ ఎమ్మెల్యే ఇలా వ్యవహరిస్తుండడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. అయితే.. కొందరు మాత్రం గణేశ్ అలా చేయాల్సిన పరిస్థితులను కవితే కల్పించారని... ఇప్పుడు ఆమె ఫలితం అనుభవిస్తున్నారని అంటున్నారు. మొదట్లో కవిత అంతా తానే అన్నట్లుగా నిజామాబాద్ జిల్లాను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేశారని... దాంతో తమ ఉనికికి భంగం వస్తుందన్న భయంతోనే గణేశ్ ఇలా ప్రచారం చేసుకుంటూ ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.