Begin typing your search above and press return to search.

త‌మ్ముళ్ల దెబ్బ‌కు బాబు మ‌ళ్లీ బుక్!

By:  Tupaki Desk   |   16 July 2018 5:26 AM GMT
త‌మ్ముళ్ల దెబ్బ‌కు బాబు మ‌ళ్లీ బుక్!
X
గోరంత‌ల్ని కొండంత‌లు చేసి చెప్పుకోవ‌టంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌ర్వాతే. ఆయ‌న్ను అమితంగా అభిమానించి.. ఆరాధించే ఆయ‌న త‌మ్ముళ్లు సైతం బాబు బాట‌నే ప‌ట్టిన‌ట్లుగా క‌నిపిస్తోంది. బాబు బాట‌లో ప‌య‌నిస్తూ త‌మ గురించి గొప్ప‌లు చెప్పుకోవ‌టం.. అందులో భాగంగా ప్ర‌త్య‌ర్థి క్రెడిట్ ను సైతం త‌మ ఖాతాలో వేసుకునే అత్యుత్సాహం మ‌రోసారి స్ప‌ష్ట‌మైంది.

బాబు మాదిరే త‌మ్ముళ్ల‌లోనూ క‌నిపించే అత్యాశ సాక్ష్యాల‌తో స‌హా దొరికిపోయి సోష‌ల్ మీడియాలో ప‌రువు పోగొట్టుకునే ప‌రిస్థితి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌.. అన్న క్యాంటీన్ల గురించి గొప్ప‌లు చెప్పి.. రాష్ట్ర వ్యాప్తంగా వంద క్యాంటీన్లు ఓపెన్ చేస్తామ‌ని గొప్ప‌లు చెప్ప‌టం తెలిసిందే. తెలంగాణ‌లో మాదిరి కాకుండా.. ఏపీలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ లో ఆడంబ‌రాల‌కు పెద్ద‌పీట వేసిన చంద్ర‌బాబు.. నాలుగేళ్లు పూర్తి అయ్యాక అన్న క్యాంటీన్ల‌ను తెర మీద‌కు తెచ్చారు.

ఈ నెల 11 నుంచి వంద క్యాంటీన్ల‌ను మొద‌లు పెడుతున్న‌ట్లు ప్ర‌చారం చేసుకున్న బాబు టీం.. తొంద‌ర‌పాటుతో తిట్లు తినిపించుకుంటోంది. త‌క్కువ ధ‌ర‌కే నాణ్య‌మైన భోజ‌నం.. టిఫిన్ అంటూ భారీగా ప్ర‌చారం చేసుకున్న బాబు బ్యాచ్‌.. చివ‌ర‌కు ఆక‌లి తీర్చుకునేందుకు క్యాంటీన్ కు వ‌చ్చిన వారికి ఫుడ్ లేదంటూ రెండోరోజే మూసేసింది.

కొన్నిచోట్ల ఫుడ్ లేదని కౌంట‌ర్లు మూసేస్తే.. మ‌రికొన్నిచోట్ల క్యాంటీన్ల‌కు వ‌చ్చిన ప్ర‌జ‌ల‌పై టీడీపీ నేత‌లు.. కార్య‌క‌ర్త‌లు దౌర్జ‌న్యం చేయ‌టం క‌నిపించింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాము చేసిన దానికి ప‌దింత‌లు చేసి చెప్పుకోవ‌టం అల‌వాటైన తెలుగుతమ్ముళ్లు.. తాజా అదే ప‌ని చేసి అడ్డంగా బుక్ అయ్యారు. అన్న‌క్యాంటీన్ల ఏర్పాటు పేరిట త‌యారు చేయించిన ప్ర‌చార చిత్రాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత క‌మ్ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి నాలుగు రూపాయిల‌కే భోజ‌నాన్ని అందించే రాజ‌న్న క్యాంటీన్ ను ఏర్పాటు చేశారు. ఇక్క‌డ తింటున్న పేద‌ల ఫోటోల్ని.. అన్న క్యాంటీన్ల ప్ర‌చారం త‌యారు చేసిన ప్ర‌క‌ట‌న‌ల్లో వాడుకోవ‌టం చూస్తే.. త‌మ్ముళ్ల తీరు విస్తుపోయేలా చేసింది.

ప‌క్కోడి పేరు ప్ర‌ఖ్యాతుల్ని అతితెలివితో త‌న ఖాతాలో వేసుకునే బాబు తీరుకు త‌గ్గట్లే.. తెలుగు త‌మ్ముళ్లు సైతం బాబు విధానాన్నే పాటిస్తున్నార‌ని.. ఇందుకు నిద‌ర్శ‌నం తాజా ఫోటోలేన‌ని చెబుతున్నారు. రాజ‌న్న క్యాంటీన్ల‌ ద‌గ్గ‌రి ఫోటోల్నిఅన్న క్యాంటీన్ ఫోటోలుగా వాడుతున్న వైనంపై సోష‌ల్ మీడియాలో చేస్తున్న పోస్టుల‌తో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అడ్డంగా బుక్ అయ్యార‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.