Begin typing your search above and press return to search.

మీడియా దెబ్బకు గాలి ఆనందం ఆవిరైందా?

By:  Tupaki Desk   |   21 Oct 2016 10:39 AM GMT
మీడియా దెబ్బకు గాలి ఆనందం ఆవిరైందా?
X
మైనింగ్ మీద వేలాది కోట్లు దండుకోవచ్చన్న విషయాన్ని దేశంలో ఎంతోమందికి తెలిసేలా చేశారు గాలి జనార్థనరెడ్డి. ఆయన మైనింగ్ డబ్బులతో బీజేపీ లాంటి పార్టీ సైతం కిమ్మనకుండా ఉండిపోవటమే కాదు.. కర్ణాటక వరకూ ఆయన విషయంలో వేలు పెట్టటానికి కూడా సాహసించేది కాదని చెప్పుకుంటారు. ఇందులో నిజం మాట ఎంతలా ఉన్నా.. ఒక దశలో కర్ణాటక రాష్ట్ర రాజకీయాలతో పాటు.. బీజేపీలో తన హవా నడిపించిన హిస్టరీ గాలి సొంతం. అలాంటి గాలికి జేడీ లక్ష్మీనారాయణ ఇచ్చిన షాక్ తో ఆయన సామ్రాజ్యం మొత్తం చెల్లాచెదురైన పరిస్థితి.

జేడీ లక్ష్మీనారాయణ ఎంట్రీ తర్వాత గాలి ఆటలు సాగటం తర్వాత సంగతి బెయిల్ కూడా రాని పరిస్థితి. బంగారు సింహాసనం మీద దర్జాగా కూర్చొని మైనింగ్ మాఫియాను తన కనుసన్నల్లో నడిపించిన గాలి.. జైల్లో నెలల తరబడి ఉంటాన్ని అస్సలు ఊహించలేని అంశంగా చెప్పాలి. గాలి లాంటి నేత జైలుకు వెళ్లినా గంటల్లో తిరిగి వస్తానని అనుకునే గాలి పరివారానికి చట్టం ఇచ్చిన షాక్ అంతా ఇంతా కాదు.

నెలల తరబడి జైల్లో ఉండిపోయిన గాలి జనార్దనరెడ్డి ఎట్టకేలకు బెయిల్ మీద బయటకు వచ్చి.. తన పని తాను కామ్ గా చేసుకుంటున్న వేళ.. ఆయన కుమార్తె పెళ్లి సందర్భంగా విడుదల చేసిన డిజిటల్ శుభలేఖ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. స్థానిక మీడియా మొదలు జాతీయ మీడియా వరకూ గాలి వారింట మోగనున్న పెళ్లి భాజాల గురించి వార్తల మీద వార్తలురాసేశారు. శుభలేఖే ఇంత భారీగా ఉంటే.. పెళ్లి మరెంత భారీగా ఉండనుందన్న విషయాన్ని చెప్పే ప్రయత్నంలో కొన్ని మీడియా సంస్థల ఉత్సాహం.. గాలికి షాకిచ్చేలా చేశాయని చెబుతున్నారు.

గాలి వారింట జరుగుతున్న పెళ్లికి వందలాది కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు వస్తున్న వార్తలతో ఐటీ శాఖ ఒక్కసారి కన్ను వేసేసరికి.. భారీతనంతో తనకు జరిగే డ్యామేజ్ ఏమిటన్న విషయం గాలి ఫ్యామిలీకి తెలిసిపోయింది. వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టేందుకు.. బి.శ్రీరాములు తెర మీదకు వచ్చారు. గాలి కుమార్తె బ్రహ్మాణి తనకు కూతురులాంటిదని చెప్పిన ఆయన.. పెళ్లిని భారీగా చేయాలని అనుకోవటం లేదని.. పెళ్లి కోసం వందల కోట్లు ఖర్చు పెడుతున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు.

పెళ్లికి ఖర్చు చేసే ఉద్దేశం లేదని.. కాకుండా శుభలేఖను కాస్త వెరైటీగా ఉండాలన్న ఉద్దేశంలో టెక్నాలజీ సాయంతో రూపొందించినట్లుగా వెల్లడించారు. నవంబరు 16న బెంగళూరులో బ్రాహ్మణి పెళ్లి జరగనుంది. ఈ కార్యక్రమాన్ని తమ స్థాయికి తగ్గట్లు మధ్యతరగతి తరహాలోనే బ్రాహ్మణి పెళ్లి జరుగుతుందన్న శ్రీరాముల మాటలు చూస్తేనే.. గాలి ఫ్యామిలీకి మీడియా తన వార్తలతో ఎంత దిమ్మ తిరిగే షాకిచ్చిందో అర్థమవుతుందని చెప్పాలి.