Begin typing your search above and press return to search.

కర్పూరీ ఠాకూర్ గురించి తెలుసా కేసీఆర్?

By:  Tupaki Desk   |   30 Nov 2016 5:30 PM GMT
కర్పూరీ ఠాకూర్ గురించి తెలుసా కేసీఆర్?
X
మంచి మాటలు అందరూ చెబుతారు. కానీ.. కొందరు మాత్రం వాటినే ఆచరిస్తారు. కానీ.. మాటలు గొప్పగా.. చేతలు మాత్రం అందుకు భిన్నంగా ఉండటం కొంతమంది ముఖ్యనేతల్లో చూస్తుంటాం. అలాంటి వారిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరు. ఆయన నోరు విప్పి ఆదర్శాలు వల్లెవేసినా..ఆయన ఆశలు.. ఆకాంక్షల గురించి విన్నా.. వావ్.. ఇట్స్ అమేజింగ్ అన్నట్లుగా ఉంటాయి. చెప్పే మాటలకు.. చేసే పనులకు ఏమాత్రం పొంతన ఉండేలా ఉంటున్నాయన్న విమర్శను మూటగట్టుకునేలా ఆయన ఈ మధ్యన వ్యవహరిస్తున్నారు.

తన నమ్మకాల్ని రాష్ట్ర ప్రజల మీద మోపటం.. ప్రజా ధనాన్ని తన నమ్మకాల కోసం వినియోగించటం ఎంతవరకూ సబబు అన్నది ఒక ప్రశ్న. తన నమ్మకానికి వసతుల లేమి పేరుతో కోట్లాది రూపాయిలు ఖర్చు చేసే కేసీఆర్ తీరును సర్లే అని సర్ది చెప్పుకొన్నా.. ఆయన తీరు రోజురోజుకూ అంతకంతకూ పెరిగిపోతున్న తీరు పలువరికి మింగుడు పడని తీరుగా మారింది. దాదాపు రూ.40 కోట్లు(ఒకట్రెండు కోట్లు తక్కువే అనుకోండి) ఖర్చుతో కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో తనకు అవసరమైన ఇంటిని నచ్చిన తీరులో కట్టించుకున్న వైనం హాట్ టాపిక్ గా మారితే.. ఆ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం అంతకు మించి అన్న రీతిలో సాగింది. తాజాగా దీనికి సంబంధించి ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏ మాత్రం తప్పు పట్టని రీతిలో వ్యవహరించే ఏపీ విపక్ష నేత జగన్ కు చెందిన మీడియా సంస్థలో తాజాగా ఒక కథనం అచ్చు అయ్యింది.

ఇందులో కేసీఆర్ తీరును నేరుగా తప్పు పడుతూ ఒక పె..ద్ద వ్యాసం అచ్చుకావటం గమనార్హం. ఈ వ్యాసం లోని అంశాలు కేసీఆర్ తీరును నిశితంగా తప్పుపట్టటమే కాదు.. కేసీఆర్ ఎంత పెద్ద తప్పు చేస్తున్నారన్న విషయాన్ని అందరికి అర్థమయ్యేలా ఉండటం గమనార్హం. ఇంతకీ ఆ వ్యాసంలో ఏం చెప్పారు.అందులోని విషయాల్ని యథాతధంగా తీసుకుంటే..

‘‘ఎవరి మత విశ్వాసాలు - వాస్తు నమ్మకాలు వారివి. అయితే అవి వ్యక్తిగతం కావాలి కానీ పరిపాలకుడి హోదాలో వాటిని ఆచరిస్తానంటేనే - అందుకోసం ఇంతింత ప్రజాధనాన్ని ఖర్చు చేస్తానంటేనే అభ్యంతరం. మన రాజకీయ నాయకులు ప్రజల డబ్బుతో ఆడంబరాలకు పోయినప్పు డల్లా భారతదేశంలో రెండవ పెద్ద రాష్ట్రం బీహార్‌ కు రెండుసార్లు ముఖ్య మంత్రిగా పని చేసిన కర్పూరీఠాకూర్ గుర్తుకొస్తారు. గతవారం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన అధికారిక గృహ సముదాయ ప్రవేశం చేసినప్పటి దృశ్యాలు టీవీలలో చూసినప్పుడు, వార్తాపత్రికలలో ఆ వార్తలు చదివినప్పుడు కర్పూరీ ఠాకూర్ మరోసారి గుర్తుకొచ్చారు. స్వాతంత్య్ర సమరయోధుడు కర్పూరీ ఠాకూర్ స్వ‌గ్రామం సమస్తిపూర్‌కు 10 కిలోమీటర్ల దూరంలోని పితుంజియా. ఒక పేద క్షురకుల కుటుంబంలో జన్మించిన కర్పూరీ మొట్టమొదటి కాంగ్రెసేతర సోషలిస్ట్ ముఖ్యమంత్రి. ఆయన లోక్‌ నాయక్ జయప్రకాష్ నారాయణ్ సంపూర్ణ క్రాంతి ఆందోళనలో భాగస్వామి కూడా’’

‘ప్రస్తుత క్రియాశీల రాజకీయ నాయకులు లాలూప్రసాద్ యాదవ్ - రామ్‌ విలాస్ పాశ్వాన్ - బీహార్ ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వంటి పలువురు కర్పూరీఠాకూర్ శిష్యులే. బిహార్ ప్రజలు ఆయనను ‘జన నాయక్’ అని పిలుచుకునేవారు. కర్పూరీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా ఆయన కుటుంబం స్వగ్రామంలోనే ఉండేది. భార్యాపిల్లలు - తండ్రి - తమ్ముడు అందరూ. ఆయన పూర్వీకుల ఆస్తి నాలుగు గుడిసెలు. ఒక ప్రముఖ పత్రికా విలేకరి ముఖ్యమంత్రి గ్రామానికి వెళ్లి ఆయన తండ్రి గోకుల్ ఠాకూర్‌ ను పలకరించినప్పుడు ‘‘కొడుకు ముఖ్యమంత్రి కదా! మీరేమిటి ఇలా?’’ అని అడిగితే ‘‘అయితే ఏమిటి’’ అని జవాబిచ్చాడట గోకుల్. ఆ విలేకరి రాష్ట్ర రాజధాని పట్నా తిరిగొచ్చి ముఖ్యమంత్రిని కలసి - ‘ఏమిటి? మీ కుటుంబం అలా పల్లెలో - పేదరికంలో?’’ అని అడిగితే ‘‘నేను అంత తెలివి గలవాడిని కాదేమో’’ అని చిరునవ్వుతో సమాధానం ఇచ్చారట. ఒక రోజు కర్పూరీ ఠాకూర్ అప్ప‌టి బీహార్ గవర్నర్‌ను కలసి ప్రభుత్వ వ్యవహారాలు ఏవో చర్చించి వెళ్లిపోయారు.మరునాడు పత్రికల్లో ముఖ్యమంత్రి కుమారుడి వివాహం జరిగిన వార్త చూసిన గవర్నర్ ఆయనకు ఫోన్ చేసి, ‘‘ఇదేమిటి నన్ను పిలవలేదు మీ ఇంట పెళ్ళికి?’’అని అడిగితే ‘‘మీలాంటి వారిని పిలిచే స్థాయి, వనరులు నాకు లేవు సార్!’’ అని వినమ్రంగా జవాబిచ్చారట. ఈ రోజుల్లో ఇటువంటివి కనీసం ఊహించగలమా? పదవుల్లో ఉన్న రాజకీయ నాయకుల కుటుంబాలు పేదరికంలోనే ఉండిపోవాలని కాదు, ఈ ఉదాహరణ కర్పూరీ నిరాడంబరత్వాన్ని గుర్తు చెయ్యడానికి మాత్రమే’’

‘‘పదవుల్లో ఉన్నవారు వీలైనంత నిరాడంబరంగా ఉండాలన్న స్పృహ - మనం ఖర్చు చేసే ప్రతి పైసా ప్రజలదేనన్న స్పృహ రోజురోజుకూ రాజకీయ నాయకుల్లో తగ్గిపోతున్నదని చెప్పుకోవడానికే ఇదంతా. ఇప్పటికి కూడా కర్పూరీ ఠాకూర్ లాగా నిరాడంబర జీవితం గడుపుతున్న నేతలు అక్కడక్కడా లేక పోలేదు.ప్రసిద్ధ ‘టైం’ పత్రిక 2012లో ప్రపంచంలోని అత్యంత ప్రభావశీలురైన వ్యక్తులలో ఒకరిగా ఎంపిక చేసిన ‘ఫైర్ బ్రాండ్’ రాజకీయ నాయకురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరాడంబరతకు పెట్టింది పేరు. వామపక్ష నాయకుడు 1998 నుంచి త్రిపుర ముఖ్య మంత్రిగా ఉన్న మాణిక్ సర్కార్ తన జీతభత్యాలన్నిటినీ మార్క్సిస్ట్ పార్టీకి విరాళంగా ఇచ్చేసి, నెల నెలా పార్టీ ఇచ్చే 5వేల రూపాయలు తన సొంత ఖర్చులకు సర్దుకుంటారు. ఆయన కుటుంబానికి సొంత ఇల్లు కానీ, వాహనం కానీ లేవు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా 2011లో పదవీ విరమణ చేసిన ఆయన భార్య పాంచాలీ భట్టాచార్య స్వయంగా బయటికెళ్లి తన పనులన్నీ చక్కబెట్టుకుంటారు. ఈ నాయకుల రాజకీయాలు ఎట్లా ఉన్నా,వాటితో ఎవరికైనా అంగీకారం లేకపోయినా వారి జీవనశైలి మాత్రం అనుసరణీయం - ఆదర్శనీయం కూడా’’ అంటూ అచ్చేసిన వ్యాసాన్ని చూస్తే.. కేసీఆర్ విధానాల్ని సూటిగా తప్పు పట్టినట్లుగా అనిపించట్లేదు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/