Begin typing your search above and press return to search.

భాగ్య‌న‌గ‌రంలో దారుణం..ఇద్ద‌రు పిల్ల‌ల్ని చంపి..

By:  Tupaki Desk   |   16 Jun 2018 5:13 AM GMT
భాగ్య‌న‌గ‌రంలో దారుణం..ఇద్ద‌రు పిల్ల‌ల్ని చంపి..
X
హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో దారుణం చోటు చేసుకుంది. ఊహించేందుకే క‌ష్టంగా ఉన్న ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. తమ ఈడు ఉన్న తోటి పిల్ల‌ల‌కు భిన్నంగా త‌మ‌దైన లోకంలో ఉండే క‌వ‌ల‌ల్ని దారుణంగా హ‌త‌మార్చిన వైనం షాకింగ్ గా మారింది. మంచి మాట‌లు చెప్పి హైద‌రాబాద్ తీసుకొచ్చి నిర్దాక్షిణ్యంగా చంపేసిన ఈ ఉదంతం గురించి తెలిస్తే అయ్యో అన‌కుండా ఉండ‌లేరు. ఇంత‌కీ ఈ జంట హ‌త్య‌ల్ని చేసింది ఎవ‌రో కాదు.. పిల్ల‌ల మేన‌మామే!

మిర్యాల‌గూడ‌కు చెందిన ల‌క్ష్మి.. శ్రీ‌నివాస‌రెడ్డి దంప‌తుల‌కు 12 ఏళ్ల వ‌య‌సున్న ఇద్ద‌రు క‌వ‌ల పిల్ల‌లు ఉన్నారు. ఈ ఇద్ద‌రు క‌వ‌ల‌లు బుద్ధి మాంధ్యం స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. త‌మ‌దైన లోకంలో ఉండే వీరిని మంచి మాట‌లు చెప్పి హైద‌రాబాద్ తీసుకొచ్చాడు మేన‌మామ మ‌ల్లికార్జున రెడ్డి. ఎందుకు చేశాడో కానీ.. మాన‌సికంగా ఎద‌గ‌ని పిల్ల‌ల్ని వ‌దిలించుకోవాల‌న్న ఉద్దేశంతో దారుణ‌మైన ప్లాన్ చేశాడు.

సిటీలోని చైత‌న్య‌పురి స‌త్యానారాయ‌ణ‌పురంలోని ఇంటికి పిల్ల‌ల్ని తీసుకొచ్చిన క‌సాయి.. పిల్ల‌ల్ని దారుణంగా హ‌త‌మార్చాడు. అనంత‌రం వారిని కారులోకి తీసుకెళ్లి.. గుట్టుచ‌ప్పుడు కాకుండా త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేశాడు. పిల్ల‌ల్ని హ‌త‌మార్చిన వైనంపై అనుమానం వ‌చ్చిన ఇంటి య‌జ‌మాని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు కారులో త‌ర‌లిస్తున్న చిన్నారుల మృత‌దేహాల‌తో పాటు.. ఈ ఘాతుకానికి పాల్ప‌డిన మ‌ల్లికార్జున‌రెడ్డిని అత‌నికి స‌హ‌క‌రించిన మ‌రో ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్నారు. ఇంత‌కీ ఈ దారుణాన్నిఎందుకు చేశాడు? దీని వెన‌కున్న ఉద్దేశం ఏమిట‌న్న అంశంపై పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఉదంతానికి సంబంధించి నిందితుడు పోలీసుల‌కు ఏం చెప్పాడ‌న్న‌ది బ‌య‌ట‌కు రావాల్సి ఉంది. చిన్నారుల మృత‌దేహాల్ని ఆసుప‌త్రికి త‌ర‌లించారు.