Begin typing your search above and press return to search.

భారతదేశ శూరత్వంపై ఉగ్రవాది వెటకారం!

By:  Tupaki Desk   |   25 Sep 2016 5:09 AM GMT
భారతదేశ శూరత్వంపై ఉగ్రవాది వెటకారం!
X
యురి ఉగ్రదాడి అనంతర పరిణామాల నేపథ్యంలో ఇండియా - పాకిస్థాన్ ల మధ్య యుద్దం జరుగుతుందా? ఆ మేరకు ఇప్పటికే అలాంటి మేఘాలు కమ్ముకుంటున్నాయా? ఈ విషయంలో భారత్ ఇంకా శాంతి మార్గాన్నే ఎంచుకుంటుందా? పాక్ ముందు జాగ్రత్తగా యుద్ద విమానాలు డ్రిల్ చేసిందా? ఇప్పటికే సామాన్యుడిని ఈ ప్రశ్నలన్నీ తొలిచేస్తున్నాయి. మనం నమ్ముకున్న శాంతే మనకు శాపంగా తయారయ్యిందని భారతీయ పౌరుడు భావిస్తున్నాడా? ఏమో కానీ.. మన శాంతిని చేతకాని తనంగా చూపిస్తూ, మన శూరత్వాన్ని వెక్కిరిస్తున్నాడు ఉగ్రవాది.. యురి దాడికి కారణమని భావిస్తున్న ఉగ్రవాది!

ఇంత జరిగినా, ఇన్ని దాడులు చేస్తున్నా ఉగ్రవాదులపై భారత్ శూరత్వం కేవలం సినిమాల్లోనే అని వెటకారంగా మాట్లాడుతున్నారు ఉగ్రవాదులు. ఈ విషయాలపై మాట్లాడిన జైషే మహ్మమద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌.. "భారతదేశ శూరత్వం బాలీవుడ్‌ సినిమాలకే పరిమితం" అని ఎద్దేవా చేస్తున్నాడు. ఉరీ దాడికి జైషే కారణమని భావిస్తున్న తరుణంలో భారత ప్రభుత్వాన్ని, సైన్యాన్ని అవహేళన చేసేలా హైషే చీఫ్ మసూద్‌ చేసిన వ్యాఖ్యలు తాజాగా ఆన్‌ లైన్‌ లో దర్శనమిచ్చాయి. మసూద్‌ వ్యాఖ్యలతో కూడిన సుమారు 10 నిమిషాల ఆడియో క్లిప్‌ ను జైషే సంస్థ తన అనుబంధ ఆన్‌లైన్‌ చానల్‌ రంగొనూర్‌ లోనూ, ఆ చానల్ వెబ్‌ సైట్‌ లోనూ పోస్టు చేసింది.

"ది రియల్‌ ఫౌంటెయిన్‌ హెడ్‌" అనే పేరుతో వీటిని విడుదల చేశారు. "భారత్ ను బలమైన శక్తిగా, పాకిస్థాన్‌ ను బలహీనమైన దేశంగా బాలీవుడ్‌ సినిమాలు చిత్రీకరిస్తుంటాయి.. తమ నీడను చూసి భయపడే బాలీవుడ్‌ హీరోలు ఏకంగా పాకిస్థాన్‌ లోని ముజాహిదీన్‌ శిబిరాలపైనే దాడులు చేసేస్తుంటారు.. ఒకే దెబ్బతో వందలాది ముజాహిదీన్లను చంపేస్తుంటారు.. ఇంతజరిగినా బాలీవుడ్‌ హీరోలకు మాత్రం ఒక్క బుల్లెట్‌ కూడా తగలదు.. వారి ఫైట్స్ అనీ ఒట్టి గ్యాస్‌" అని మసూద్‌ బాలీవుడ్‌ సినిమాలు, హీరోలపైనా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బాలీవుడ్‌ సినిమాల్లో హీరోల పరిస్థితి ఎలా ఉన్నా వాస్తవ పరిస్థితిలో మాత్రం... కేవలం నలుగురు జిహాదీలు 18 మంది భారతీయ సైనికులను మట్టుబెట్టారని వ్యాఖ్యానించారు. కాగా సుమారు 10 నిమిషాలు మాట్లాడినా ఎక్కడా ఉరి ఘటనకు తమదే బాధ్యతని మసూద్‌ ప్రకటించలేదు.