Begin typing your search above and press return to search.

'దృశ్యం' త‌ర‌హాలో మారుతీరావు స్కెచ్!

By:  Tupaki Desk   |   18 Sep 2018 2:16 PM GMT
దృశ్యం త‌ర‌హాలో మారుతీరావు స్కెచ్!
X
నిజ జీవితంలో జ‌రిగిన కొన్ని ఘ‌ట‌న‌ల ఆధారంగా సినిమాలు తెర‌కెక్కించ‌డం.....కొన్ని సినిమాల నుంచి స్ఫూర్తి పొంది నిజ‌జీవితంలో అదే త‌ర‌హాలో కొన్ని ప‌నులు చేయ‌డం....వంటివి స‌మాజంలో జ‌రుగున్న సంగ‌తి తెలిసిందే. అంతిమ తీర్పు సినిమాను స్ఫూర్తిగా తీసుకుని తాను ప‌రిటాల ర‌విని హ‌త్య చేశాన‌ని మొద్దు శీను స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఇలా సినీ ఫక్కీలో దొంగ‌త‌నాలు - హ‌త్య‌ల‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న‌లు అనేకం ఉన్నాయి. తాజాగా - మిర్యాలగూడలో పెను సంచలనం రేపిన ప్రణయ్ హత్య కూడా అదే కోవ‌కు చెందుతుంది. ఆ కేసులో ప్ర‌ధాన నిందితుడైన అమృత తండ్రి మారుతీరావు....దృశ్యం సినిమా త‌ర‌హాలో ఆ కేసు నుంచి త‌ప్పించుకోవాల‌ని మాస్ట‌ర్ ప్లాన్ వేశాడ‌ట‌. అయితే, ఆ ప్లాన్ విఫ‌లం కావ‌డంతో చివ‌ర‌కు మారుతీరావుతో పాటు నిందితులు క‌ట‌క‌టాల పాల‌య్యార‌ని న‌ల్గొండ ఎస్పీ రంగనాథ్ మీడియాకు వెల్ల‌డించారు. ప్ర‌ణ‌య్ ను హ‌త్య చేసిన సుభాష్ శర్మ తోపాటు - నిందితులు మారుతీ రావు - శ్ర‌వ‌ణ్ - అస్గర్ అలీ - మహ్మద్ బారీ - అబ్దుల్ కరీం - శివ ల‌ను రంగ‌నాథ్ ....మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. మొత్తం ఏఢుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

పెళ్లయినప్పటి నుంచి ప్రణయ్ ని హ‌త్య చేయాల‌ని మారుతీరావు ప్లాన్ చేస్తున్నాడ‌ని రంగ‌నాథ్ చెప్పారు. ఆగస్ట్ 18న బ్యూటీపార్లర్ వద్ద తొలిసారి హత్యా ప్రయత్నం చేశార‌ని - సెప్టెంబర్ మొదటి వారంలో రెండోసారి హత్యకు ప్రణాళిక ర‌చించార‌ని తెలిపారు. ప్ర‌ణ‌య్ హ‌త్య ఈ నెల 14న మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో జరిగిందని - అంత‌కుముందే మారుతీ రావు నల్గొండకు వచ్చారని ఎస్పీ చెప్పారు. హ‌త్య చేసేందుకు అస్గర్ అలీ - శర్మ కలిసి వచ్చారని చెప్పారు. ఘటనాస్థలికి దూరంగా ఉండి హత్యను అస్గర్ అలీ పర్యవేక్షించాడ‌ని చెప్పారు. పక్కా స్కెచ్ వేసి ఆసుపత్రి వద్ద కత్తితో దాడి చేశారని తెలిపారు. అయ‌తే - దృశ్యం సినిమా త‌ర‌హాలో పోలీసుల‌ను క‌న్ ఫ్యూజ్ చేసి త‌ప్పించుకోవాల‌ని మారుతిరావు - నిందితులు ప్లాన్ చేశార‌ని అన్నారు. కానీ, మారుతీ రావు ప్లాన్ విఫలమైం పోలీసులకు దొరికిపోయాడ‌ని అన్నారు.