Begin typing your search above and press return to search.

బాబు కుటుంబానికి ఆత్మాహుతి దాడి వార్నింగ్‌

By:  Tupaki Desk   |   26 Oct 2016 12:08 PM GMT
బాబు కుటుంబానికి ఆత్మాహుతి దాడి వార్నింగ్‌
X
ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు మావోయిస్టులు తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఏవోబీలో భారీ ఎన్‌ కౌంట‌ర్ నేప‌థ్యంలో మావోయిస్టు పార్టీ ఏపీ క‌మిటీ అధికారి ప్ర‌తినిధి శ్యామ్ బాబు కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఈ హెచ్చ‌రిక‌లు పంపారు. చంద్రబాబు తేనె పూసిన కత్తి అని, విశాఖ మారణకాండ ఫలితాన్ని ఆయ‌న త్వ‌ర‌లోనే అనుభ‌వించ‌బోతున్నార‌ని కూడా శ్యామ్ అన్నారు. చంద్ర‌బాబుతో పాటు ఆయ‌న కుమారుడు లోకేష్ సైతం త‌మ నుంచి త‌ప్పించుకోలేర‌ని...చంద్ర‌బాబు కుటుంబంపై ఆత్మాహుతి దాడి చేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామ‌ని శ్యామ్ తీవ్ర హెచ్చ‌రిక చేశారు.

చంద్ర‌బాబును - ఆయ‌న కుటుంబాన్ని ఎప్పుడూ పోలీసులు - మిల‌ట‌రీ ద‌ళాలు కాప‌డ‌లేవ‌న్న విష‌యాన్ని ఆయ‌న గుర్తుంచు కోవాల‌ని.. మోడీ-చంద్ర‌బాబు కుట్ర ఫ‌లితంగానే ఈ హ‌త్యాకాండ అని ఆయ‌న చెప్పారు. ఇక ఈ హ‌త్యాకాండ‌కు ప్ర‌తీకారంగా తాము రాజ‌కీయ నాయ‌కుల‌ను భారీ స్థాయిలో టార్గెట్ చేస్తామ‌ని కూడా చెప్పారు. శ్యామ్ వ్యాఖ్య‌లు ఇప్పుడు పెద్ద సంచ‌ల‌నంగా మారాయి.

కోవ‌ర్టుల ద్వారా విషం క‌లిపిన అన్నాన్ని మావోయిస్టుల‌కు తినిపించార‌ని... ఆ విష ఆహారం తిన్న వెంట‌నే ప‌డిపోయిన వారిపై పోలీసులు వారిపై విచ‌క్ష‌ణా ర‌హితంగా కాల్పులు జ‌రిపార‌ని శ్యామ్ ఆరోపించారు. ఇక త‌మ‌కు దొరికిన మావోయిస్టుల‌ను పోలీసులు ర‌హ‌స్య ప్ర‌దేశానికి తీసుకువెళ్లి వారిని తీవ్ర హింస‌ల‌కు గురి చేసి...వారి నుంచి పూర్తి స‌మాచారం తెలుసుకున్నాక మంగ‌ళ‌వారం వారిని కూడా చంపేశార‌ని శ్యామ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇక మావోయిస్టుల ఉద్య‌మంలో ఇది ఓ పెద్ద తుఫాన్ లాంటిద‌ని..దీని నుంచి నాలుగు రోజుల్లో త‌ట్టుకుని నిల‌బ‌డ‌తామ‌న్న ఆయ‌న గాయాల‌తో ప్ర‌భుత్వ ఆధీనంలో ఉన్న మావోయిస్టుల‌ను వెంట‌నే విడుద‌ల చేయ‌ని ప‌క్షంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం త‌గిన మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌ని ఆయ‌న ప్ర‌భుత్వానికి వార్నింగ్ ఇచ్చారు.

ఇక ప్ర‌భుత్వం ప్ర‌జాస్వామ్యం పేరుతో హ‌త్య‌లు చేసి వాటిని ఎన్‌కౌంట‌ర్లుగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేస్తోంద‌న్న శ్యామ్ పోలీసులు - మిల‌ట్రీ వాళ్లు అవార్డులు - రివార్డుల కోసం కిరాయి హ‌త్య‌లు చేస్తున్నార‌ని తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌జాప్ర‌తినిధులు అడ‌వులు - కొండ‌ల‌ను దోచుకుతింటున్నార‌ని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. ఇక 2003 అక్టోబ‌ర్ 1న తిరుమ‌ల అలిపిరి దాడి నుంచి త‌ప్పించుకున్న చంద్ర‌బాబు ఈ సారి త‌మ నుంచి త‌ప్పించుకోలేర‌ని కూడా మావోయిస్టులు చంద్ర‌బాబుకు తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రిక‌లు పంపారు.

ఇక తాజా ఘ‌ట‌న నేప‌థ్యంలో యావోయిస్టులు ఇంత తీవ్రంగా కౌంట‌ర్ ఇవ్వ‌డంతో పాటు...సీఎం చంద్ర‌బాబు కుటుంబాన్నే లేపేస్తామ‌ని వార్నింగ్ ఇవ్వ‌డంతో ఏపీలో భ‌ద్ర‌తాద‌ళాలు, సీఎం చంద్ర‌బాబు సెక్యూరిటీ పూర్తిగా అలెర్ట్ అయిపోయాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/