Begin typing your search above and press return to search.

మావోయిస్టుల కొత్త టార్గెట్..టీడీపీ మంత్రి పుత్ర‌ర‌త్నం!

By:  Tupaki Desk   |   26 Jun 2017 4:34 AM GMT
మావోయిస్టుల కొత్త టార్గెట్..టీడీపీ మంత్రి పుత్ర‌ర‌త్నం!
X
నిషేధిత మావోయిస్టులు తెలుగు రాష్ట్రాల్లో మ‌రింత‌గా పుంజుకుంటున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఉత్త‌రాంధ్ర స‌రిహ‌ద్దు జిల్లాల్లోని అట‌వీ ప్రాంతాలు - ఆ జిల్లాలకు ఆనుకుని ఉన్న ఒరిస్సా స‌రిహ‌ద్దు ప్రాంతం ఏవోబీలో మావోయిస్టులు త‌మ కార్య‌క‌లాపాల‌ను ముమ్మ‌రం చేసిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల అక్క‌డ జ‌రిగిన ఎన్ కౌంట‌ర్‌ లో 20 మందికి పైగా మావోయిస్టులు చ‌నిపోయిన వైనం కూడా వారి ఉనికి ఉంద‌ని చెప్ప‌క‌నే చెబుతోంది.

విశాఖ జిల్లాలోని బాక్సైట్ తవ్వ‌కాల‌ను వ్య‌తిరేకిస్తున్న గిరిజ‌నుల‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్న మావోయిస్టులు టీడీపీ సీనియ‌ర్ నేత‌ - ఏపీ కేబినెట్‌ లో కీల‌క మంత్రిగా ఉన్న చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడును హెచ్చ‌రిస్తూ గ‌తంలో లేఖ‌లు విడుద‌ల చేశారు. ఈ ఘ‌ట‌న‌ను మ‌రువ‌క‌ముందే... వారు అయ్య‌న్న కుటుంబానికి చెందిన మ‌రో వ్య‌క్తిని టార్గెట్‌ గా చేసుకున్నారు. అయ్య‌న్న కుమారుడు చింత‌కాయ‌ల విజ‌య్ ను ఉద్దేశిస్తూ నిన్న మావోయిస్టులు మీడియాకు ఓ లేఖ‌ను విడుద‌ల చేశారు.

మావోయిస్టు పార్టీ తూర్పు డివిజ‌న్ క‌మిటీ కార్య‌ద‌ర్శి కైలాస్ పేరిట విడుద‌లైన స‌ద‌రు లేఖ ఇప్పుడు టీడీపీ నేత‌ల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తోంది. విశాఖ జిల్లా జీకే వీధి మండ‌లం స‌రుగుడు క్వారీ వెలికితీత‌లో విజ‌య్‌ కు పెద్ద ఎత్తున వాటాలున్నాయ‌ట‌. స‌రుగుడు క్వారీ తవ్వ‌కాల‌ను వ్య‌తిరేకిస్తున్న గిరిజ‌నానికి త‌మ సంపూర్ణ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ఆ లేఖ‌లో మావోయిస్టు పార్టీ తేల్చిచెప్పింది. ఆ త‌వ్వ‌కాల‌ను గిరిజ‌నుల‌తో పాటు మావోయిస్టు పార్టీ కూడా వ్య‌తిరేకిస్తోంద‌ట‌. ఆ ప్రాంతానికి చెందిన ఆదీవాసీల్లోనే కొంద‌రు వ్య‌క్తుల‌ను బినామీలుగా చేసుకుని విజ‌య్ అండ్ కో అక్ర‌మ మైనింగ్‌ కు పాల్ప‌డుతున్నార‌ని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.

ఈ అక్ర‌మాల‌ను ప్ర‌శ్నించిన ఓ విలేక‌రిని చంపేస్తామంటూ విజ‌య్ అనుచ‌రులు అబ్బాయిరెడ్డి - శ్రీను బెదిరించార‌ట‌. ఇకపై వీరిద్ద‌రూ త‌మ ప‌ద్ద‌తుల‌ను మార్చుకోవాల‌ని, లేని ప‌క్షంలో తీవ్ర ప‌రిణామాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని కైలాసం హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. అంతేకాకుండా స‌రుగుడులోనే కాకుండా రాజ‌పాక‌లు క్వారీని కూడా త‌క్ష‌ణ‌మే తవ్వ‌కాల‌ను నిలిపివేయాల‌ని, త‌మ హెచ్చ‌రిక‌ల‌ను బేఖాత‌రు చేస్తూ ముందుకు వెళితే త‌గిన మూల్యం చెల్లించుకుంటార‌ని ఆయ‌న ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ ఇప్పుడు విశాఖ జిల్లా స‌హా ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో పెను సంచల‌నంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/