Begin typing your search above and press return to search.

ఒడిషాలో ఎన్నికల సిబ్బందిపై మావోల ఘాతుకం

By:  Tupaki Desk   |   18 April 2019 10:45 AM GMT
ఒడిషాలో ఎన్నికల సిబ్బందిపై మావోల ఘాతుకం
X
రెండో దశ పోలింగ్ సందర్భంగా హింస చెలరేగింది. ఒడిషా రాష్ట్రంలోని కంధమాల్ జిల్లా అడువుల్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఎన్నికల సిబ్బందిని అటకాయించిన మావోయిస్టులు జీపుతోపాటు ఈవీఎంలు, ఇతర సామగ్రిని తగులబెట్టారు. అనంతరం ఒక ఎన్నికల ఆఫీసర్ ను చంపేశారు.

కంధమాల్ లోక్ సభ పరిధిలోని పుల్బనీ అసెంబ్లీ పరిధిలో స్కూల్ టీచర్ గా పనిచేస్తున్న సంజుక్తా దిగల్ మధ్యాహ్నం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో పోలింగ్ సామగ్రిని తీసుకొని జీపులో బయలుదేరారు. మధ్యలో రోడ్డుకు అడ్డంగా ఏవో వేయడంతో జీపు దిగి పరిశీలించడానికి వెళ్లిన సంజుక్తా దిగల్ పై పక్కనే పొదల్లో ఉన్న మావోయిస్టులు కాల్పులు జరిపారు. అనంతరం ఈవీఎం, సామగ్రిని తగుల బెట్టారు. ఇతర సిబ్బంది క్షేమంగా ఉన్నారని.. ఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టామని ఒడిషా డీజీపీ బీకే శర్మ తెలిపారు.

కాగా మావోయిస్టు ప్రాబల్యమున్న ప్రాంతాల్లో భద్రత సిబ్బందిని తక్కువగా కేటాయించడంపై ఎన్నికల సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు బహిష్కరించిన మావోయిస్టులు పోస్టర్లు, బ్యానర్లు కట్టినా సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికల సిబ్బందికి రక్షణ కల్పించలేదని వారు మండిపడ్డారు. కనీసం ఎస్కార్ట్ పంపలేదని ఎన్నికల సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు.