Begin typing your search above and press return to search.

గోదారి జిల్లాలో మావో డంప్‌

By:  Tupaki Desk   |   29 July 2015 9:24 AM GMT
గోదారి జిల్లాలో మావో డంప్‌
X
తెలుగు రాష్ట్రాల్లో క‌నుమ‌రుగు అయిపోయార‌ని భావించిన మావోలు మ‌ళ్లీ పుంజుకుంటున్నారా? రాష్ట్ర విభ‌జ‌న బ‌ల‌హీన‌మైన మావోల్ని శ‌క్తివంతం చేసిందా? ఈ మ‌ధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మావోల క‌ద‌లిక‌లు పుంజుకుంటున్నాయా? లాంటి ప్ర‌శ్న‌ల‌కు నిజ‌మేన‌న్న మాట వినిపించే ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి.

ప్ర‌శాంతంగా ప‌చ్చ‌ని పొలాల‌తో.. కొబ్బ‌రి చెట్ల‌తో అల‌రారే.. గోదావ‌రి జిల్లాలో తాజాగా భారీ డంప్ ఒక‌టి బ‌య‌ట‌ప‌డింది. తూర్పు గోదావ‌రిజిల్లాలోని వై.రామ‌వ‌రం మండ‌లం డొంక‌రాయి వ‌ద్ద భారీ మావో డంప్ ఒక‌టి బ‌య‌ట‌ప‌డింది.
ఈ డంప్ లో అత్యాధునిక గ్రెనేడ్లు.. రాకెట్ లాంచ‌ర్లు.. భారీ మందుగుండు సామాగ్రి ల‌భించ‌టం చూసి పోలీసులు షాక్ తింటున్నారు. ఇంత భారీ మొత్తంలో డంప్ బ‌య‌ట‌ప‌డ‌టం వారి నోట మాట రాకుండా చేస్తోంది.

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణ‌లో మావోల క‌ద‌లిక‌లు పెరిగాయ‌న్న మాట వినిపించింది. దీనికి త‌గ్గ‌ట్లే అప్పుడ‌ప్ప‌డు తెలంగాణ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ప‌లు అంశాల్ని ప్ర‌స్తావిస్తూ.. పోస్ట‌ర్లు వెల‌వ‌టం తెలిసిందే. దీంతో.. ప‌లువురు మావోల క‌ద‌లిక‌లు తెలంగాణ జిల్లాలో మాత్ర‌మే ఉన్నాయ‌న్న‌ట్లుగా భావించారు.

అయితే.. చాప కింద నీరులా మావోలు ఏపీలోనూ బ‌లం పెంచుకుంటున్నార‌న్న విష‌యం ఈ మ‌ధ్య కాలంలో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌లు నిరూపించాయి. ఈ మ‌ధ్య‌న గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో మావోల పోస్ట‌ర్లు ద‌ర్శ‌న‌మిచ్చాయి. రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాలు పారాహుషారుతో లేక‌పోతే.. ఇంత‌కాలం ఉనికే లేకుండా పోయిన మావోల ఇష్యూ మ‌ళ్లీ మొద‌లుకావ‌టం ఖాయ‌మ‌ని పోలీసు ఉన్న‌తాధికారులు హెచ్చ‌రిస్తున్నారు. మ‌రి.. తెలుగు ప్ర‌భుత్వాలు ఏం చేస్తాయో చూడాలి.