Begin typing your search above and press return to search.

సీఎంకు ఇది ప‌రువు స‌మ‌స్యే

By:  Tupaki Desk   |   25 Oct 2016 9:47 AM GMT
సీఎంకు ఇది ప‌రువు స‌మ‌స్యే
X
క‌ర‌వ‌మంటే క‌ప్ప‌కు...విడ‌వ‌మంటే పాముకు కోపం అన్న‌ట్లుగా త‌యారైంది ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప‌రిస్థితి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా హామీ ఇచ్చిన మేర‌కు కాపుల రిజ‌ర్వేష‌న్ విష‌యంలో ఏపీలో ముందడుగు వేస్తున్న‌ప్ప‌టికీ పరిస్థితులు అనుకూలించేలా లేవు. కాపులను బీసీలో చేర్చే విషయమై కర్నూలులో జరిగిన మంజునాథ్ కమిటీ విచారణ గందరగోళంగా తయారైంది. కమిషన్‌ కు అనుకూల - వ్యతిరేక నినాదాలతో సమావేశం దద్దరిల్లింది. దీంతో తీవ్ర అసహనానికి గురైన చైర్మన్ మంజునాథ్ అర్ధాంతరంగా సమావేశాన్ని వాయిదా వేసి వెళ్లిపోయారు. దీంతో కాపుల రిజ‌ర్వేష‌న్ వ‌ర్సెస్ బీసీల‌కు న్యాయం అనే స‌మ‌స్య ప‌రిష్కారంపై నీలినీడ‌లు క‌మ్ముకుంటున్నాయని పేర్కొంటున్నారు.

కాపులను బీసీ జాబితాలో చేర్చే అంశంపై రాష్ట్రంలో విచారణ చేపట్టిన మంజునాథ్ కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ - సభ్యులు సుబ్రమణ్యం - పూర్ణచంద్రరావు - కృష్ణ మోహన్ - సత్యనారాయణ కర్నూలు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విచారణ నిర్వహించారు. కమిషన్ సభ్యులు సమావేశానికి రాక ముందే ఒక వైపు బీసీ సంఘాలు - మరో వైపు కాపు సంఘాలు పోటాపోటీ నినాదాలతో హోరెత్తించాయి. 10.30 గంటల ప్రాంతంలో కమిషన్ చైర్మన్ మంజునాథ ఆధ్వర్యంలో సభ్యులు వేదికపై కూర్చుని ప్రజల నుంచి ఫిర్యాదులు - వినతులను స్వీకరించడానికి సిద్ధమయ్యారు. సమావేశ మందిరం బయట నినాదాలు చేస్తున్న వారు లోపలికి చొచ్చుకుని వచ్చి బీసీ కమిషన్‌ కు అనుకూల - వ్యతిరేక నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు. నినాదాలు ఆపాలని - వినతిపత్రాలు అందజేయాలని చైర్మన్ మంజునాథ్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఎవరూ ఖాతరుచేయలేదు. ఆయన మాటలు ఎవరూ వినిపించుకోకుండా ఇరువర్గాలు కేకలు వేయడంతో మంజునాథ్ తీవ్ర అసహనానికి లోనయ్యారు. కమిషన్ న్యాయం చేస్తుందని సహకరించాలని మరోమారు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసుల నమోదుకు ఆదేశించాల్సి వస్తుందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఎవరికి వారు గట్టిగా కేకలు వేస్తుండడంతో చైర్మన్ - సభ్యులు కొద్దిసేపు చర్చించుకుని అర్ధాంతరంగా సమావేశాన్ని వాయిదావేసి వేదిక దిగి వెళ్లిపోయారు. ఇది గమనించిన బీసీ సంఘాల నాయకులు నినాదాలు చేస్తు ర్యాలీగా రహదారి పైకి చేరుకుని ఆందోళన చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో కమిషన్ సభ్యులు విశ్రాంతి తీసుకుంటున్న ప్రభుత్వ అతిధి గృహం వైపు వెళ్లారు. అయితే పోలీసులు అనుమతించకపోవడంతో వెనుదిరిగారు.

బీసీ కమిషన్ విచారణకు ఎవరు ఆటంకం కలిగించినా కేసుల నమోదుకు ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎంఎల్ మంజునాథ్ హెచ్చరించారు. కర్నూలు ప్రభుత్వ అతిథి గృహంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ బీసీ కమిషన్ ఏ ఒక్క కులానికో, వర్గానికో అనుకూలంగా వ్యవహరించబోదని స్పష్టం చేశారు. కొన్ని కులాలవారు బీసీ జాబితాలో చేర్చాలని విన్నవిస్తుండగా, బీసీ జాబితా సి - డి విభాగాల్లోని వారు ఎ విభాగంలో చేర్చాలని కోరుతున్నారని పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటిపై సమ‌గ్ర విచారణ కోసమే తాము జిల్లాల పర్యటన చేస్తున్నామని వివరించారు. అవసరమైతే ఆయా కులాల స్థితిగతులు - సామాజిక పరిస్థితిని తెలుసుకోవడానికి గ్రామాల్లో కూడా పర్యటిస్తామన్నారు. రాష్ట్రంలో 64 కులాలకు సంబంధించిన ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకోకుండా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అంతేగాక రాష్ట్రంలో ప్రజా సాధికార సర్వే జరుగుతోందని ఆ సర్వే నివేదికను కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/