Begin typing your search above and press return to search.

వైసీపీ ప్ర‌తిప‌క్షం..టీడీపీకీ ఈ మంత్రి ప్ర‌తిప‌క్షం

By:  Tupaki Desk   |   12 Jan 2018 11:12 AM GMT
వైసీపీ ప్ర‌తిప‌క్షం..టీడీపీకీ ఈ మంత్రి ప్ర‌తిప‌క్షం
X
ఆంద్ర‌ప్ర‌దేశ్ బీజేపీ సీనియ‌ర్ నేత‌ - మంత్రి మాణిక్యాల‌రావు మ‌రోమారు త‌న అస‌హ‌నం - ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. అదికూడా మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీ నేత తీరును తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. ఏకంగా ఇక‌నుంచి వారం వారం స్పందిస్తూనే ఉంటాన‌ని వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రమంతటా వైసీపీని ప్రతిపక్షంగా చూస్తుంటే తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం నాయకుల వింత వైఖరితో తమను ప్రతిపక్ష పార్టీగా చూస్తున్నారని మంత్రి మాణిక్యాలరావు ఈ సంద‌ర్భంగా విమర్శించారు.

మిత్ర‌ప‌క్షంగా ఉన్న‌ప్ప‌టికీ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బీజేపీని తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా చూస్తోందని, చేస్తున్న పనులను అడుగడుగునా అడ్డుకుంటోందని మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మండిపడ్డారు. ఆఖ‌రికి ముఖ్య‌మంత్రి జీవో విడుదల చేసినా ఇక్కడ పనులు జరగనివ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.సీఎం చంద్రబాబు 2016లో విడుదల చేసిన 233 జీవో ద్వారా నియోజకవర్గంలోని 31 గ్రామాల్లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ - సీసీ రోడ్ల ఏర్పాటుకు రూ.4 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. అయిన‌ప్ప‌టికీ ఆ ప‌నులు ఇంకా పెండింగ్‌ లో పెట్టార‌ని మంత్రి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ అభివృద్ది పనులు జరిపేందుకు జిల్లా పరిషత్‌ లో తీర్మానం చేయాల్సి ఉండగా ఏడాదిన్నర కాలంగా దీనిని నిలుపుదల చేశారని ప‌రోక్షంగా జెడ్పీ చైర్మ‌న్‌ పై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

ఈ సంద‌ర్భంగా ఇటీవ‌లి ప‌రిణామాల‌పై సైతం మంత్రి మాణిక్యాల రావు స్పందించారు. వెంకట్రామన్నగూడెం, రామన్నగూడెం గ్రామాల్లో జరిగిన జన్మభూమిలో తనను నిలదీయాలంటూ పిలుపునివ్వడం చాలా బాధ కలిగించిందన్నారు. ఆ బాధను భరించలేక తాను ఇప్పుడు ఇలా బైటపడాల్సి వచ్చిందని మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. ఈ సంద‌ర్భంగా త‌న మ‌న‌సులోని ఆవేద‌న‌ను సైతం మంత్రి బ‌య‌ట‌పెట్టుకున్నారు. టీడీపీకి చెందిన తాడేపల్లిగూడెం మునిసిపల్‌ చైర్మన్‌ బొలిశెట్టి శ్రీనివాస్‌ తనను ఆఫ్ట్రాల్ ఫొటోగ్రాఫర్‌ అని కామెంట్‌ చేస్తున్నారని మంత్రి మాణిక్యాలరావు ఆవేదన వ్యక్తం చేశారు. `అవును నేను ఫొటోగ్రాఫర్‌ గానే వచ్చాను. పుట్టుకతో కోటీశ్వరుడిని కాదు. ప్లాట్‌ ఫారంపై ఆగి టీ తాగుతాను. స్టార్‌ హోటల్‌ అంటే నాకు తెలియదు...అయితే అందులో తప్పేంటి` అని మంత్రి మాణిక్యాలరావు ప్రశ్నించారు.

కాగా, తాడేప‌ల్లి గూడెంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను - మిత్ర‌ప‌క్షం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును టీడీపీ అధిష్ఠానం తెలుసుకోవాల‌న్నారు. దిద్దుబాటు చర్య చేపట్టాలని సూచించిన మంత్రి ఇకపై వారం వారం మీడియా ముందుకు వచ్చి ఏ పని ఎందుకు ఆగిందో చెబుతానని హెచ్చరించారు. మిత్ర‌ప‌క్షాల మ‌ధ్య మైత్రి చెడిపోవ‌ద్ద‌ని త‌న ఉద్దేశ‌మ‌ని, కానీ ప‌రిణామాలు స్పందించేలా చేస్తున్నాయ‌న్నారు.