Begin typing your search above and press return to search.

కేసీఆర్ తో అపాయింట్ మెంట్ ఇప్పిస్తే కోటి ఇస్తాడ‌ట‌

By:  Tupaki Desk   |   15 Jun 2018 4:33 AM GMT
కేసీఆర్ తో అపాయింట్ మెంట్ ఇప్పిస్తే కోటి ఇస్తాడ‌ట‌
X
ద‌ళితుల హ‌క్కుల కోసం పోరాడే ఉద్య‌మ‌నేత‌ల్ని గుర్తుకు తెచ్చుకున్నంత‌నే గుర్తుకొచ్చే నేత‌గా ఎమ్మార్పీఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు మంద‌కృష్ణ మాదిగ గుర్తుకు వ‌స్తారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో ముఖ్య‌మంత్రుల‌ను సైతం త‌న అల్టిమేటంతో వ‌ణుకు తెప్పించిన స‌త్తా మంద‌కృష్ణ సొంతం. ఆయ‌న నోటి నుంచి ఉద్య‌మ షెడ్యూల్ వెల్ల‌డైతే చాలు.. ప్ర‌భుత్వాలు ఒక్క‌సారిగా అలెర్ట్ అయ్యే ప‌రిస్థితి.

అలాంటి మంద‌కృష్ణ‌కు తెలంగాణ‌లో వ‌రుస ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి. త‌న‌ను తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇబ్బందిపెడుతున్న‌ట్లుగా ఆరోపిస్తున్నారు. కేసీఆర్ ను క‌లిసేందుకు తానిప్ప‌టికి ప‌దిసార్లు లేఖ‌లు రాశాన‌ని.. వంద‌ల సార్లు అప్పీలు చేసిన వైనాన్ని గుర్తు చేసిన మంద‌కృష్ణ తాజాగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య ఒక‌టి చేశారు.

త‌న‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో అపాయింట్ మెంట్ ను 48 గంట‌ల్లో ఇప్పిస్తే.. బిచ్చ‌మెత్తెనా రూ.కోటి ఇస్తానంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాజాగా రాజ‌న్న సిరిసిల్ల జిల్లా ఇల్లంత‌కుంట మండ‌లంలో హ‌త్య‌కు గురైన తండ్రికొడుకుల కుటుంబాన్ని పరామ‌ర్శించిన మంద‌కృష్ణ‌.. కేసీఆర్ తీరును త‌ప్పు ప‌ట్టారు.

తెలంగాణ ఉద్య‌మ సంద‌ర్భంగా ఆమ‌ర‌ణ‌దీక్ష‌కు దిగితే.. ఆయ‌న‌కు నిమ్మ‌రసం ఇచ్చి దీక్ష‌ను విర‌మింప‌చేసింది మ‌రెవ‌రో కాద‌ని.. తానేన‌ని చెప్పారు. అలాంటి త‌న‌కు కేసీఆర్ ను క‌లిసే అర్హ‌త లేదా? అంటూ సూటిగా ప్ర‌శ్నించారు. కేసీఆర్ పాల‌న‌లో ద‌ళితుల‌కు న్యాయం జ‌ర‌గ‌లేద‌న్న విమ‌ర్శ చేశారు. ఎంత‌టి ప్ర‌ముఖులైనా.. క‌లుసుకునేందుకు ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌ని కేసీఆర్ తీరును ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు వీలుగా మంద‌కృష్ణ కోటి మాట‌ను మాట్లాడి ఉంటార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.