Begin typing your search above and press return to search.

ఆ రాజకీయ వారసులకు మంచు విష్ణు శుభాకాంక్షలు!

By:  Tupaki Desk   |   21 March 2019 10:12 AM GMT
ఆ రాజకీయ వారసులకు మంచు విష్ణు శుభాకాంక్షలు!
X
ఈ ఎన్నికలతో ప్రత్యక్ష రాజకీయ బరిలోకి దిగిన ఇద్దరు రాజకీయ వారసులకు విషెష్ చెప్పాడు మంచు విష్ణు. మోహన్ బాబుకు సన్నిహితులుగా పేరున్న ఇద్దరు దివంగత పొలిటీషియన్ల తనయులకు మోహన్ బాబు తనయుడు శుభాకాంక్షలు తెలిపారు. వారిద్దరూ తనకు సోదరులు లాంటి వారని.. వారు తమ తండ్రుల స్థాయిని అందుకోవాలని మంచు విష్ణు ఆకాంక్షించారు. ఈ మేరకు ట్వీట్ పెట్టాడు.

మంచు విష్ణు శుభాకాంక్షలు తెలిపింది మరెవరికో కాదు.. అనంతపురం జిల్లా రాప్తాడు నుంచి పోటీ చేస్తున్న పరిటాల శ్రీరామ్ కు, కృష్ణా జిల్లా గుడివాడ నుంచి ఎమ్మెల్యే సీటుకు బరిలోకి దిగిన దేవినేని అవినాష్ కు మంచు విష్ణు శుభాకాంక్షలు తెలిపారు.

అటు పరిటాల రవీంద్రతో, ఇటు దేవినేని నెహ్రూతో మోహన్ బాబుకు మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. పరిటాల రవి తన తండ్రి పరిటాల శ్రీరాములు జీవిత కథ ఆధారంగా తీసిన శ్రీరాములయ్య సినిమాలో సైతం నటించారు మోహన్ బాబు. వారి మధ్యన అంత సాన్నిహిత్యం ఉంది. ఇక దేవినేని నెహ్రూ కూడా మోహన్ బాబుకు సన్నిహితుడే.

ఇప్పుడు పరిటాల రవి లేరు, దేవినేని నెహ్రూ లేరు. ఇప్పుడు వారి తనయులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఒకే ఎన్నికలతో వారు పోటీ చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి వారు రంగంలోకి దిగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు తనయుడు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ.. ట్వీట్ చేశాడు.

విశేషం ఏమిటంటే.. వీరిద్దరూ తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగుతున్నారు. మంచు విష్ణు కుటుంబానికి వైఎస్ కుటుంబంతో కూడా బంధుత్వం ఉంది. ఇటీవల మోహన్ బాబు మాట్లాడుతూ.. చంద్రబాబు తీరుపై మండి పడ్డారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు అని.. మోహన్ బాబు కాలేజీలకు భారీగా ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను రిలీజ్ చేయడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయినా రాజకీయాలకూ కుటుంబ బంధాలకు సంబంధం లేదన్నట్టుగా మంచు విష్ణు స్పందించినట్టుగా ఉన్నాడు.