Begin typing your search above and press return to search.

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ మంచు లక్ష్మి

By:  Tupaki Desk   |   3 Sep 2015 1:32 PM GMT
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ మంచు లక్ష్మి
X
మంచు మోహన్ బాబు తనయ లక్ష్మీ ప్రసన్న తెలంగాణ రాష్ట్రంలో స్వచ్ఛ భారత్ మిషన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది. నరేంద్ర మోడీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆరంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మొదట పెద్దగా పట్టించుకోని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్య ఆ కార్యక్రమానికి చాలా ప్రాధాన్యమిస్తున్న సంగతి తెలిసిందే. మున్ముందు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని భావిస్తున్న కేసీఆర్.. ఆ దిశగా కొన్ని చర్యలు చేపడుతున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి సంబంధించి ప్రతి రాష్ట్రానికి కేంద్రం ఓ బ్రాండ్ అంబాసిడర్ ను ఎంపిక చేసింది. తెలంగాణ ప్రాంతానికి ఆ బాధ్యత మంచు లక్ష్మికి అప్పగించారు. మంచు లక్ష్మి ప్రధాని పిలుపు ఇచ్చినపుడే స్వచ్ఛందంగా ముందుకొచ్చి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేశారు.

సెప్టెంబ‌ర్ 10న రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ లో ప‌లువురు ప్ర‌ముఖుల మ‌ధ్య‌లో రాష్ట్ర‌ప‌తి లక్ష్మిని సత్కరించబోతుండటం విశేషం. ఈ సందర్భంగా మంచు ల‌క్ష్మి మాట్లాడుతూ.. "ప్రధాని న‌రేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు అందుకొని, నా స్థాయిలో నేను ఇప్ప‌టికే ఎన్నో కార్య‌క్ర‌మాలు చేశాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేయ‌డం మ‌రింత బాధ్య‌త పెంచింది. ఈ నెల 10న ఢిల్లీలోని రాష్ర్ట‌ప‌తి కార్యాల‌యంలో రాష్ర్ట‌ప‌తి చేతుల మీదుగా గౌర‌వాన్ని అందుకోవ‌డం నా అదృష్టం. తెలంగాణ రాష్ర్టాన్ని స్వ‌చ్చ తెలంగాణ‌గా మార్చ‌డానికి నా వంతు స‌హాయ స‌హ‌కారాలు అందిస్తాను" అని చెప్పారు. ఐతే గతంలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మోహన్ బాబు వ్యాఖ్యలు చేసినందుకు మోహన్ బాబు, మంచు లక్ష్మిలపై టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించడం గుర్తుండే ఉంటుంది. మరి మంచు లక్ష్మి నియామకం విషయం ఆ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.​