Begin typing your search above and press return to search.

యోగిగా మారానంటున్న నాటి సెక్సీతార

By:  Tupaki Desk   |   28 July 2016 8:15 AM GMT
యోగిగా మారానంటున్న నాటి సెక్సీతార
X
ఇప్పటితరానికి పరిచయం లేదు కానీ.. కాస్త 70.. 80లలో పుట్టిన వారికి మమతాకులకర్ణి అన్న పేరు విన్న వెంటనే ముద్దుగా.. బొద్దుగా ఉండే బాలీవుడ్ భామ గుర్తుకు వస్తుంది. చూడచక్కని రూపంతో పాటు.. అవసరానికి మించిన అందాల ప్రదర్శనతో ఒక ఊపు ఊపేసిన ఆమె.. ఆ తర్వాత కాలంలో పెద్దగా కనిపించలేదు. ఇటీవల డ్రగ్స్ మాఫియాతో ఆమెకు సంబంధం ఉందంటూ పోలీసుల కేసు నమోదు చేయటంతో ఆమె పేరు మరోసారి తెర మీదకు వచ్చింది. ఇంతకీ బాలీవుడ్ లో చెలరేగిపోయిన ఆమె.. తర్వాతి కాలంలో ఏమయ్యారు? ఏం చేశారన్న విషయాల్లోకి వెళితే.. డ్రగ్స్ రాకెట్ నిందితుడు విక్కీ గోస్వామితో ప్రేమలో పడ్డారు.

అనంతరం అతనితో సహజీవనం చేసిన ఆమె.. తర్వాతి కాలంలో డ్రగ్స్ మాఫియాలో కీలకభూమిక పోషిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం నైరోబీలో ఉంటున్న ఆమెపై ముంబయిలో డ్రగ్స్ రాకెట్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ మీడియా సంస్థ మమతాకులకర్ణికి సంబంధించిన ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. నైరోబీలో ఉన్న ఆమెతో ఈమొయిల్ ఇంటర్వ్యూ చేసిన సదరు మీడియా సంస్థ ఆ వివరాల్ని వెల్లడించింది.

ఈ సందర్భంగా మమతాకులకర్ణి తాను ఇంటర్వ్యూ ఇవ్వటానికి ఒక కండీషన్ పెట్టారట. తన ఆత్మకథ చదివిన తర్వాతే తాను ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పి.. తొలుత తన ఆత్మకథను పంపారట. ఇక.. ఇంటర్వ్యూలో తన గురించి వివరిస్తూ.. బాలీవుడ్ లో టాప్ 2 హీరోయిన్ గా ఉన్న సమయంలోనే తనకు సినిమా రంగం సూట్ కాదని అర్థమైందని చెప్పింది. తర్వాతి రోజుల్లో తాను అధ్యాత్మిక రంగం వైపుకు తిరిగానని.. కాపాలిలోని శ్రీ గగన్ గిరి మహారాజ్ గురువు దగ్గర దీక్ష తీసుకొని యోగిగా మారినట్లుగా పేర్కొన్నారు.

తనకు డ్రగ్స్ మాఫియాకు ఏ మాత్రం సంబంధం లేదని.. అదంతా పోలీసుల కుట్రగా ఆమె అభివర్ణిస్తున్నారు. తన గురించి తెలుసుకోవాలంటే తన ఆత్మకథ ముందు చదవాలని.. అది చదివితే తానేంటో తెలుస్తుందని చెబుతున్నారు. నైరోబీలో ప్రస్తుతం తానొక అపార్ట్ మెంట్లో యోగా.. ధ్యానం చేసుకుంటూ బతుకుతున్నట్లుగా ఆమె వెల్లడించారు.

విక్కీ తన స్నేహితుడని.. తనకు ప్రపంచం చూపిస్తానని తీసుకెళ్లాడని పేర్కొన్న ఆమె.. తర్వాతి కాలంలో పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించారు. తర్వాత తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని.. విక్కీ జైలుశిక్ష అనుభవించి తిరిగి వచ్చిన తర్వాత తాను కలుసుకోలేదన్నారు. డ్రగ్స్ కుంభకోణంలో రూ.2వేల కోట్లుగా చెప్పే పోలీసుల వ్యాఖ్యను ప్రస్తావిస్తూ.. తన దగ్గర అంత డబ్బే కనుక ఉండి ఉంటే నైరోబీలో ఒక అద్దె ఇంట్లో తాను ఎందుకు ఉంటానని ప్రశ్నించటం గమనార్హం. తన బ్యాంక్ ఖాతాలోరూ.25లక్షలు ఉన్నాయని.. వాటిపై వచ్చే వడ్డీతోనే తాను బతుకుతున్నట్లుగా ఆమె పేర్కొంది. మమతాకులకర్ణి చెప్పిన మాటలే నిజమైతే.. ఇంతకాలం ఆమె గురించి పట్టించుకోని ముంబయి పోలీసులకు ఇప్పుడే ఆమెను పట్టించుకోవాల్సిన అవసరం ఏముంటుంది?