Begin typing your search above and press return to search.

దీదీ వెళుతుంటే.. మోడీ సతీమణి ఎదురైతే?

By:  Tupaki Desk   |   18 Sep 2019 5:43 AM GMT
దీదీ వెళుతుంటే.. మోడీ సతీమణి ఎదురైతే?
X
రాజకీయంగా ఉండే శత్రుత్వం ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. అందునా ప్రధాని నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలాంటి ఇద్దరు మొండి అధినేతల మధ్య రాజకీయ ప్రత్యర్థిత్వం ఉంటే సినిమా మామూలుగా ఉండదు. బెంగాల్ లో దీదీ కంచుకోటను బద్దలు చేయటమే మోడీ లక్ష్యమైతే.. దేశంలో ఎక్కడైనా మోడీ పప్పులు ఉడుకుతాయేమో కానీ.. తన అడ్డా లాంటి పశ్చిమబెంగాల్ లో మాత్రం అది సాధ్యం కాదన్నట్లుగా వ్యవహరిస్తుంటారు మమత బెనర్జీ.

రాజకీయంగా ఈ ఇద్దరి నేతల మధ్యనున్న శత్రుత్వం తరచూ హాట్ టాపిక్ గా మారటమేకాదు.. దేశ వ్యాప్తంగా చర్చకు తెర తీస్తుంటుంది. ఇదిలా ఉంటే.. మోడీతో భేటీ కోసం కోల్ కతా నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు మమత ఎయిర్ పోర్ట్ కు వచ్చారు. ఫ్లైట్ ఎక్కేందుకు ఎయిర్ పోర్ట్ లో వెళుతున్న ఆమెకు.. అనూహ్యంగా మోడీ సతీమణి జశోదాబెన్ తారసపడ్డారు.

ఆ వెంటనే ఆగిన దీదీ.. ఆమెను అప్యాయంగా పలుకరించటమే కాదు.. కాసేపు మాట్లాడుకున్నారు. ఇంతకీ మోడీ సతీమణి (దీర్ఘకాలంగా దూరంగా ఉంటున్నా.. ఎన్నికల అఫిడవిట్లో జశోదాబెన్ ను తన సతీమణిగా మోడీ పేర్కొనటం తెలిసిందే) జశోదాబెన్ కోల్ కతాకు ఎందుకు వెళ్లారన్న విషయంలోకి వెళితే.. తరచూ పుణ్యక్షేత్రాల్ని సందర్శిస్తూ వివిధ ప్రాంతాలకు ప్రయాణించే ఆమె.. తాజాగా బెంగాల్ లోని పుణ్యక్షేత్రాల్ని సందర్శించి తిరిగి వెళ్లిపోతున్నారు. ఈ సందర్భంలోనే ఎయిర్ పోర్ట్ లో దీదీకి ఆమె తారస పడ్డారు.

ఇరువురి మధ్య అప్యాయకర సంభాషణ జరిగినట్లుగా తెలుస్తోంది. అనూహ్యంగా తనకు తారసపడ్డ జశోదాబెన్ కు దీదీ మర్యాదపూర్వకంగా ఒక చీరను బహుకరించారు. ఇంతకీ.. తాను జశోదాబెన్ ను కలిసిన వైనాన్ని తన తాజా భేటీలో మోడీ వద్ద దీదీ ప్రస్తావిస్తారంటారా?