Begin typing your search above and press return to search.

బీజేపీని తరమండి.. దేశాన్ని రక్షించండి

By:  Tupaki Desk   |   21 July 2018 4:31 PM GMT
బీజేపీని తరమండి.. దేశాన్ని రక్షించండి
X
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి - పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మ‌రోమారు త‌న ఉగ్ర‌రూపం ప్ర‌ద‌ర్శించారు. త‌న ఇలాకాలో పాగా వేయాల‌నుకుంటున్న బీజేపీపై నిప్పులు చెరిగారు. కోల్‌క‌తాలో జరిగిన టీఎంసీ అమరుల వార్షిక ర్యాలీలో మమతా బెనర్జీ పాల్గొని ప్రసంగించారు. ఈ సంద‌ర్భంగానే బీజేపీ - కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నేతలు.. ఇవాళ తృణమూల్ కాంగ్రెస్‌ లో చేరారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సమక్షంలో మాజీ బీజేపీ నాయకుడు చందన్ మిత్ర - కాంగ్రెస్ నాయకులు సమర్ ముఖర్జీ - అబు తాహీర్ - సబినా యాస్మిన్ - అక్రుజ్‌ మన్‌ లు టీఎంసీలో చేరారు. వీరందరికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రానున్న లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ సంఖ్యాబలం 100 సీట్లకు పడిపోనున్నట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. నిన్నటి అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఎన్డీఏ 325 ఓట్లను కలిగి ఉంది. కాగా ఈ సంఖ్యాబలం వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో 100 స్థానాలకు పడిపోనున్నట్లు వెల్లడించారు.

బీజేపీని తరమండి.. దేశాన్ని రక్షించండి అనే నినాదంతో ప్రచారం చేస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో సంచలనం జరగబోతుందన్న ఆమె.. దేశానికి బెంగాల్ దారి చూపిస్తుందని తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 100 స్థానాల కంటే తక్కువనే గెలుస్తుందన్నారు. వచ్చే ఏడాది జనవరిలో దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులతో కలిసి బెంగాల్‌ లో మెగా ర్యాలీ నిర్వహిస్తామని మమతా బెనర్జీ చెప్పారు. ఇటీవలే మిడ్నాపూర్‌ లో నిర్వహించబడిన మోడీ బహిరంగ సభలో టెంటు కుప్పకూలిన విషయం తెలిసిందే. టెంట్ కుప్పకూలిన ఘటనలో 90 మంది గాయపడిన విషయం ప్ర‌స్తావిస్తూ పందిరి చక్కగా వేయలేని వారు.. దేశాన్ని ఎలా రక్షిస్తారు అని మ‌మ‌తాబెన‌ర్జీ ఎద్దేవా చేశారు.

వచ్చే సాధారణ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ రాష్ట్రంలోని మొత్తం 42 లోక్‌ సభ స్థానాలకు కైవసం చేసుకుంటుందని మ‌మ‌తాబెన‌ర్జీ ధీమా వ్య్తం చేశారు. దేశాన్ని రక్షించేందుకు తాము బీజేపీని తరిమికొట్టనున్నట్లు తెలిపారు. ఇదే తమ ప్రతిజ్ఞ అని అన్నారు. బీజేపీని ఓడించడానికి ఫెడరల్ ఫ్రంట్ మార్గంను అనుసరించనున్నట్లు వెల్లడించారు. కూర్చీ గురించి తమకేం బాధలేదని తమ ఆలోచనంతా దేశం - ప్రజల గురించేనన్నారు. లోక్‌ సభలో బీజేపీ సంఖ్యాబలం తగ్గుతూ వస్తుందని ఉత్తరప్రదేశ్ - మధ్యప్రదేశ్ - రాజస్థాన్ - గుజరాత్ - బిహార్ - ఒడిశా - పశ్చిమబెంగాల్ - తమిళనాడు రాష్ర్టాలే ఇందుకు ఉదాహరణ అని ఆమె పేర్కొన్నారు. కాగా, ప్రధాని మోడీ - అమిత్ షా ప్రవర్తనతో పార్టీలో సంతోషంగా ఉండలేకపోతున్నానని బీజేపీ విధి విధానాలు నచ్చక ఇటీవలే ఆ పార్టీకి చందన్ మిత్ర రాజీనామా చేశారు. 2016లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హుగ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన చందన్ మిత్ర.. డిపాజిట్లు కోల్పోయారు. జర్నలిస్టుగా కేరీర్ ప్రారంభించిన చందన్ మిత్ర.. ఢిల్లీ నుంచి వెలువడుతున్న పయ‌నీర్ న్యూస్ పేపర్‌ కు ఎడిటర్‌ గా విధులు నిర్వర్తిస్తున్నారు.