Begin typing your search above and press return to search.

రాష్ట్రప‌తిగా ఓట‌మి...రాజ్య‌సభ ఎంపీగా చాన్స్‌

By:  Tupaki Desk   |   27 July 2017 7:43 AM GMT
రాష్ట్రప‌తిగా ఓట‌మి...రాజ్య‌సభ ఎంపీగా చాన్స్‌
X
ఇటీవ‌ల జ‌రిగిన రాష్ట్రపతి ఎన్నిక‌ల్లో ఓటమి పాలైన ప్రతిపక్షాల అభ్యర్థి - కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కురాలు మీరా కుమార్ విష‌యంలో ఆ పార్టీ పెద్ద‌లు కొత్త ప్ర‌తిపాద‌న ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలుస్తోంది. రాష్ట్రప‌తి పోరులో పార్టీ మాట‌ను గౌర‌వించి ఎన్నిక‌ల బరిలో నిలిచ‌నందుకు గాను ఆమెను పెద్దల సభ‌కు పంపించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చే ఆగ‌స్టులో ఖాళీ కానున్న రాజ్య‌స‌భ సీట్ల‌లో ఒక బెర్తును ఖ‌రారు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. అయితే త‌మ పార్టీ నుంచి కాకుండా బెంగాల్‌ లో అధికార పార్టీ అయిన తృణ‌మూల్ కాంగ్రెస్‌ ద్వారా మీరాకుమార్‌ కు ఈ చాన్స్ ఇస్తార‌ని తెలుస్తోంది.

రాష్ట్రపతి ఎన్నికలో ఓటమిపాలైన మీరాకుమార్‌ .. రాజ్యసభ ఎన్నికలో పోటీ చేస్తారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో రెండు పార్టీల మధ్య చర్చ జరిగిందని స‌మాచారం. ప్ర‌థ‌మ పౌరుడిగా ఎన్నికైన‌ రామ్‌ నాథ్‌ కోవింద్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం కాంగ్రెస్‌ - తృణమూల్‌ పార్టీల మధ్య రాజ్యసభ ఎన్నికల ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా బెంగాల్‌ నుంచి మీరాకుమార్‌ ను పోటీకి నిలిపినట్లైతే ఆ స్థానం నుంచి పోటీ చేయబోమని కాంగ్రెస్‌ కు తృణమూల్‌ సౌహ్రార్థ్ర సందేశం పంపిందని అంటున్నారు. తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీనే ఆ పార్టీ నేత డెరెక్‌ ఒబ్రియన్‌ చేత ఈ సందేశాన్ని కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియాగాంధీకి పంపించినట్లు సమాచారం. కేవలం మీరా కుమార్‌ కైతేనే ఆ అవకాశమని మమత స్పష్టం చేయడం విశేషం.

అయితే ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ పంపిన నిర్ణ‌యంపై కాంగ్రెస్ పార్టీ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. మీరాకుమార్‌ కు రాజ్య‌స‌భ చాన్స్ ఇవ్వ‌డం ఖాయ‌మ‌ని అయితే అది ఏ రాష్ట్రం నుంచి ఉంటుంద‌నేది ఇంకా నిర్ణ‌యించుకోలేద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు అంఉట‌న్నారు. కాగా, వచ్చే నెలలో బెంగాల్‌ లో ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి.