Begin typing your search above and press return to search.

హరీశ్ చెప్పేవన్నీ అబద్ధాలంటున్న ఒంటేరు

By:  Tupaki Desk   |   30 July 2016 7:05 AM GMT
ఏ ముహుర్తంలో షురూ చేశారో కానీ మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఇష్యూ తెలంగాణ రాష్ట్ర సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కేసీఆర్ సర్కారును రెండు భాగాలుగా విభజిస్తే.. మల్లన్నసాగర్ కు ముందు.. ఈ ప్రాజెక్టు నిర్ణయం తర్వాత అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఇష్యూ రచ్చ రచ్చకావటానికి ముందు వరకూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. ప్రశ్నించే అవకాశమే ఉండేది కాదు. ఆయన్ను వేలెత్తి చూపించేందుకు ఛాన్స్ ఉండేది కాదు. అలాంటి పరిస్థితి నుంచి ప్రతి అంశాన్ని వంక పెట్టేందుకు అవకాశం కల్పించింది మల్లన్నసాగర్ ప్రాజెక్టు అని చెప్పక తప్పుదు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మల్లన్నసాగర్ ప్రాజెక్టుకింద నిర్వాసితులయ్యే వారికి ఇచ్చే ప్యాకేజీ వ్యవహారంలో బాధితులు ఏ ప్యాకేజీ కోరుకుంటే అది ఇస్తామని ఓపెన్ గా ముఖ్యమంత్రే ప్రకటించిన తర్వాత కూడా ఆందోళనలు తగ్గుముఖం పట్టకపోవటం గమనార్హం. రోజురోజుకీ పరిస్థితి మరింత ముదిరిపోతున్న వేళ.. ఈ ఇష్యూను వ్యక్తిగత ప్రతిష్ఠగా తీసుకున్న మంత్రి హరీశ్ రావు.. ఎనిమిది గ్రామాల ప్రజలతో వేర్వేరుగా చర్చలు జరిపి.. ఆరు గ్రామాల ప్రజలు భూములు ఇచ్చేందుకు ఒప్పుకున్నారంటూ వెల్లడించారు.

ఎనిమిది గ్రామాలకు ఆరు గ్రామాల ప్రజలు భూములు ఇచ్చేందుకు సిద్ధమని చెబుతున్న వేళ.. ఆయా గ్రామాల్లో రాజకీయ పార్టీ నేతలు పర్యటించటంపై ఆంక్షలు విధించటమే కాదు.. నేతలు ఎవరైనా మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో పర్యటిస్తున్నారని తెలిసినా వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ముంపు గ్రామాల ప్రజలు భూములు ఇచ్చేందుకు సిద్ధమైతే.. ప్రభుత్వం ఎందుకిలా వ్యవహరిస్తుందన్న ప్రశ్నకు సమాధానం చెప్పని పరిస్థితి.

ఇదిలా ఉంటే.. మంత్రి హరీశ్ చెబుతున్న మాటల్లో నిజం లేదని.. ఆయన అన్ని అబద్ధాలు చెబుతున్నారంటూ ఆరోపిస్తున్నారు తెలుగు రైతులు అధ్యక్షులు ఒంటేరు ప్రతాప్ రెడ్డి. టీఆర్ఎస్ నేతలు దళారుల అవతారాలు ఎత్తి ముంపుగ్రామాల్లోనిరైతుల భూముల్ని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని.. వారిని బెదిరిస్తున్నారంటూ ఆరోపించారు. పోలీసులతో గ్రామాల్ని నిర్బంధించి తనిఖీ కేంద్రాల్నిఏర్పాటు చేశారని.. బయట వాళ్లుఎవరూ ముంపు గ్రామాల్లోకి రాకుండా చూస్తున్నారని.. ఎవరైనా వస్తే వెంటనే అరెస్ట్ చేస్తున్నారని ఆరోపణలు సంధించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు పై మంత్రి హరీశ్ చెబుతున్నవన్ని అబద్ధాలుగా చెప్పిన ఒంటేరు మాటలతో పాటు.. జరుగుతున్న పరిణామాలు టీఆర్ఎస్ సర్కారు ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నాయన్న భావన వ్యక్తమవుతోంది. తమ తీరుపై తెలంగాణ సర్కారు పునరాలోచించుకోవటం మంచిదన్న మాట రాజకీయ వర్గాల్లో పలువురు వ్యక్తం చేయటం గమనార్హం.