Begin typing your search above and press return to search.

టీడీపీ పాల‌న‌కు తొలి స‌మాధి రాయి ప‌డింది

By:  Tupaki Desk   |   27 July 2017 4:20 PM GMT
టీడీపీ పాల‌న‌కు తొలి స‌మాధి రాయి ప‌డింది
X
వైఎస్ ఆర్సీపీ ప్లీనరీతో రాష్ట్రంలోని టీడీపీ పాలనకు తొలి సమాది రాయి పడిందని మాజీ మంత్రి - వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు కె.పార్థసారధి అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ - మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైసీపీలో చేరిన సంద‌ర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయ‌న‌ మాట్లాడుతూ పెన్షన్ లు ఇస్తున్నా.. రోడ్లు వేస్తున్నా.. అంటూ చంద్రబాబు చెప్పుకుంటున్నారని అయితే దివంగ‌త సీఎం వైఎస్ హయాంలో ఇంతకన్నా ఎక్కువే ప్రజాసంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు. ప్రజలు ప్రత్యేక హోదా అడుగుతూ ఉంటే... ప్రత్యేక ప్యాకేజీ తెచ్చానంటూ మోసం చేస్తున్నారని పార్థసార‌ధి ఆక్షేపించారు. జిల్లాలో మంత్రులు ప్రజలను గాలికి వదిలేశారని, జ్వరాలతో ప్రజలు అల్లాడుతూ వుంటే.. జిల్లా మంత్రులు నిర్లక్ష్యంగా ఉన్నారని మండిప‌డ్డారు. విజయవాడ నగరంలో 20 వేల పక్కా గృహాలు వైఎస్ ఆర్ నిర్మించారని - టీడీపీ ప్రభుత్వం ఉన్న ఇళ్ళు తొలగించడం తప్ప ఒక్క పేద వాడికి గూడు కల్పించలేదని పార్థ‌సార‌థి తెలిపారు.

కాపు రిజర్వేషన్ ల విషయంలో ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని వైసీపీ సీనియ‌ర్ నేత వంగవీటి రాధాకృష్ణ అన్నారు. విజయవాడ నుంచే చంద్రబాబు పతనం ప్రారంభమవుతుందని తెలిపారు. రాబోయేది రాజన్న రాజ్యమ‌ని ఆయ‌న తెలిపారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అందరూ కష్టపడి పనిచేస్తామ‌ని ప్ర‌క‌టించారు. వంగవీటి రంగాకు మల్లాది విష్ణు అత్యంత సన్నిహితుడని, ఆయన వైఎస్ ఆర్‌ సీపీలో చేరడం వల్ల పార్టీ మరింత బలపడుతుందని అన్నారు.

పార్టీలో చేరిన సంద‌ర్భంగా మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు మాట్లాడుతూ అన్న వస్తున్నాడనే నినాదం రాష్ట్ర ప్రభుత్వ గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయని చెప్పారు. అనాడు వంగవీటి రంగాతో అడుగులు వేశామ‌ని, ఆ తరువాత వైఎస్ ఆర్ మమ్మల్ని వెన్నుతట్డి ప్రజాసేవకు చేరువ చేశారని గుర్తుకుచేశారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థ లు నాశనమవుతున్నాయని వాటిని అడ్డుకుని, బాగుచేయగలిగే శక్తి వున్న నేత వైఎస్ జగన్ మాత్ర‌మేన‌ని తెలిపారు. ఆయనకు మద్దతు ఇవ్వాలనే వైఎస్ ఆర్‌ సీపీ చేరుతున్నాన‌ని ప్ర‌క‌టించారు. పట్డణాల్లోని పేదలకు ఇళ్లు లేవు... డ్వాక్రా మహిళలకు రుణమాఫీ లేదు అని పేర్కొంటూ రాష్ట్రంలో దృతరాష్ట్ర పాలన సాగుతోందని మ‌ల్లాది విష్ణు మండిప‌డ్డారు. 2019లో పదిశాతం ఎక్కువ ఓట్లతో వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వస్తుందని ధీమా వ్య‌క్తం చేశారు. విజయవాడ నగరంను వైఎస్ఆర్ సిపిని కంచుకోటగా మార్చేందుకు ఎవరితో అయినా కలిసి పనిచేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు.