Begin typing your search above and press return to search.

ఈ మాటలన్నీ తెలంగాణ డిప్యూటీ సీఎమ్మే అన్నారు

By:  Tupaki Desk   |   30 May 2016 7:12 AM GMT
ఈ మాటలన్నీ తెలంగాణ డిప్యూటీ సీఎమ్మే అన్నారు
X
స్థాన బలం అని ఊరికే అనలేదేమో మన పెద్దోళ్లు. ఎంతటోడైనా స్థాన బలం ముందు డంగై పోవాల్సిందే. తాజాగా ఇదే విషయాన్ని చెప్పేలా ఒక ఉదంతం చోటు చేసుకుంది. తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి మహమూద్ ఆలీ ఏపీలోని నెల్లూరు జిల్లాకు వెళ్లారు. అక్కడి ఏఎస్ పేటలోని ఖాజా నాయబ్ రసూల్ దర్గాను సందర్శించారు. ఈ దర్గా అంటే తెలంగాణ డిప్యూటీ సీఎంకు గురి ఎక్కువ. ఈ దర్గాను సందర్శించిన ప్రతిసారీ తనకు ఏదో ఒక మంచి జరుగుతుందని బలంగా విశ్వసించే ఆయన.. వినేందుకు విచిత్రంగా ఉండేలా కొన్ని వ్యాఖ్యలు చేసి ఆశ్చర్యానికి గురి చేశారు.

గత కొద్దిరోజులుగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల జోరు పెరిగిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఏపీలో తన వ్యక్తిగత పని మీద వచ్చిన తెలంగాణ డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ పెద్దన్నయ్య లాంటిదని వ్యాఖ్యానించటం విశేషం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఉందన్న ఆయన.. తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి.. ఏఎస్ పేట దర్గా అభివృద్ధికి కొన్ని నిధులు మంజూరు చేయిస్తానని చెప్పటం గమనార్హం. పెద్దన్నయ్య అంటూ ప్రేమగా మాటలు చెప్పిన డిప్యూటీ సీఎం.. అందుకు తగ్గట్లే రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు ఉంటే అంతకు మించి కావాల్సిందేముంది?