Begin typing your search above and press return to search.

ఇదేం మాట క‌త్తి?: 'మోడీని న‌డిరోడ్డుపైనే కాల్చేయాలి'

By:  Tupaki Desk   |   11 April 2018 7:59 AM GMT
ఇదేం మాట క‌త్తి?: మోడీని న‌డిరోడ్డుపైనే కాల్చేయాలి
X
సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా మారుతున్న క‌త్తి మ‌హేశ్ నోటి నుంచి వ‌చ్చిన మాట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పేరులోనే క‌త్తిని పెట్టుకొని తిరిగే మ‌హేశ్ త‌ర‌చూ చేసే వ్యాఖ్య‌లు వార్తాంశాలుగా మారుతుంటాయి. సినీ విమ‌ర్శ‌కుడ‌న్న ట్యాగ్ లైన్ తో ప‌రిచ‌య‌మై.. బిగ్ బాస్ షో తో సెల‌బ్రిటీగా మారిన ఆయ‌న‌.. ప‌వ‌న్ పేరును అదే ప‌నిగా జపించి.. తీవ్ర‌స్థాయిలో దునుమాడ‌టం ద్వారా పేరు ప్ర‌ఖ్యాతుల్ని సొంతం చేసుకున్న ఆయ‌న ప్ర‌తి అంశంపైనా స్పందిస్తూ ఉంటారు.

కొన్నిసంద‌ర్భాల్లో తొంద‌ర‌ప‌డిన‌ట్లుగా వ్యాఖ్య‌లు చేసిన‌ట్లుగా క‌నిపించే క‌త్తి.. ఈసారి నిజంగానే తొంద‌ర‌ప‌డ్డారా? అన్న ప్ర‌శ్న‌ను లేవ‌నెత్తే వ్యాఖ్య‌ను చేశారు. ప్ర‌ధాని మోడీని న‌డిరోడ్డుపైనే కాల్చేయాలంటూ సంచ‌ల‌న వ్యాఖ్య చేసిన క‌త్తి.. దీనికి కార‌ణం కూడా చెప్పుకొచ్చారు.

పెద్ద‌నోట్ల ర‌ద్దు ఫ‌లాల్ని 50 రోజుల్లో ప్ర‌జ‌లంద‌రికి అంద‌ర‌క‌పోతే త‌న‌ను కాల్చేయాల‌ని ప్ర‌ధాని మోడీనే ప్ర‌క‌టించార‌ని గుర్తు చేశారు. పెద్ద‌నోట్ల ర‌ద్దు అయిన ఇన్నాళ్ల త‌ర్వాత కూడా ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఫ‌లాలు అంద‌క‌పోగా.. నోట్ల ర‌ద్దు వ్య‌వ‌హారం ఎంద‌రో అమాయ‌కులు బ‌లైన‌ట్లుగా ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

దీనికి కార‌ణ‌మైన ప్ర‌ధాని మోడీని న‌డి రోడ్డు మీద కాల్చేయాల‌న్న క‌త్తి మ‌హేశ్‌.. మోసాలు.. అబ‌ద్ధాలు.. ద్రోహాల‌కు చిరునామాగా మోడీ చ‌రిత్ర‌లో నిలిచిపోతార‌న్నారు. ప్ర‌జ‌ల్ని ర‌క్షించే రాజ్యాంగాన్ని ప్ర‌జ‌లే ర‌క్షించాల్సిన అవ‌స‌రం వ‌చ్చింద‌న్న క‌త్తి.. సంఘ్ ప‌రివార్‌.. బీజేపీ మ‌తోన్మాద శ‌క్తులు రాజ్యాంగ రిజ‌ర్వేష‌న్ల‌ను తుంగ‌లోకి తొక్కార‌న్నారు. అనంత‌పురంలో నిర్వ‌హించిన రాజ్యాంగ ప‌రిర‌క్ష‌ణ స‌భ‌లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన క‌త్తి మ‌హేశ్ పై పోలీసులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటార‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ప్ర‌ధాని స్థానంలో ఉన్న ముఖ్య‌నేత‌పై ఈ త‌ర‌హా వ్యాఖ్యల్ని పోలీసులు.. న్యాయ‌వ్య‌వ‌స్థ ఏ మేర‌కు స్పందిస్తాయ‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.