Begin typing your search above and press return to search.

‘మోడీ బన్ గయా జాదూగర్’

By:  Tupaki Desk   |   22 Feb 2018 8:17 AM GMT
‘మోడీ బన్ గయా జాదూగర్’
X
ప్రధాని నరేంద్రమోడీ మెజీషియన్ లాగా తయారయ్యాడుట. ఆయన ఎంత గొప్ప మెజీషియన్ అంటే ఏకంగా మన దేశంలోని డెబ్భై అయిదేళ్ల ప్రజాస్వామ్యాన్ని కూడా ఏకంగా మాయం చేసేయగలడట...! ప్రధాని గురించి ఆయన టేలెంట్ గురించి ఇలాంటి వెటకారపు విమర్శలు చేస్తున్నది మరెవ్వరో కాదు.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్.

ఇవాళ పీఎన్‌ బీని 17 వేల కోట్లకు ముంచిన నీరవ్ మోడీ - నిన్న విజయమాల్యా లాంటి వాళ్లంతా ఈ దేశంలో మాయమైపోయి.. విదేశాలలో ప్రత్యక్షం అవుతున్నారని అంటూ.. ఇలాంటి అక్రమార్కులు హాయిగా తప్పించుకుని విదేశాలకు చెక్కేయడం వెనుక కేంద్ర ప్రభుత్వం అండదండలు పుష్కలంగా ఉన్నాయని ఇండైరక్టుగా ఆరోపణలు గుప్పిస్తూ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. అందుకే ఆయన మోడీని.. జాదూగర్ అంటూ మాయగాడిగా అభివర్ణించారు.

అయితే తెలుగు ప్రజల ఆవేదన ఇంకో రకంగా ఉంది.

మోడీ మహా మాయగాడు అనే సంగతి గుర్తించడానికి తమరికి ఇంతకాలం పట్టిందా రాహుల్ బాబూ.. ఆ సంగతి మేం ఎప్పుడో కనిపెట్టేశాం అని వారంటున్నారు. తిరుపతి సభలో పదేళ్లపాటూ ప్రత్యేకహోదా ను మీరాష్ట్రానికి ఇచ్చే పూచీ నాది అని ప్రకటించిన తర్వాత.. వెంకన్న పాదాల సాక్షిగా ఆ విషయం చెబుతున్నట్లు మాట ఇచ్చిన తర్వాత.. ఏ రోజైతే ప్రత్యేక ప్యాకేజీ అనే ఒక బ్రహ్మపదార్థాన్ని తెరమీదకు తీసుకువచ్చారో ఆరోజే ఆయన మాయగాడు అనే సంగతి మాకు అర్థమైందని ప్రజలంటున్నారు.

తిరుపతి సభలో.. దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని తలదన్నే రాజధానిని మీ రాష్ట్రానికి నేను నిర్మించి ఇస్తా అంటూ తానేదో పెద్ద మేస్త్రీలాగా - ఆర్కిటెక్టు లాగా బూటకపు మాటలు చెప్పిన నరేంద్రమోడీ.. అమరావతి రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానిస్తే చెంబుడు నీళ్లు - గుప్పెడు మట్టి తెచ్చి మన మొహాన కొట్టిన నాడే ఆయన మహా మాయగాడు అనే సంగతి మాకు అర్థమైందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మోడీ మాటల మాయల గురించి చెప్పుకోవడం దండగ అని.. రాష్ట్రానికి ఏం కావాలన్నా పోరాటం ఒక్కటే శరణ్యం అని ప్రజలు అనుకుంటున్నారు. ఆయన మాయల్ని ఇన్నాళ్లకైనా గుర్తించిన రాహుల్ తమ రాష్ట్రం కోసం పోరాటాలకు అండగా నిలిస్తే చాలునని కోరుకుంటున్నారు.