Begin typing your search above and press return to search.

ఆయనకు కేసీఆరే సుప్రీంకోర్టు

By:  Tupaki Desk   |   31 July 2015 7:09 AM GMT
ఆయనకు కేసీఆరే సుప్రీంకోర్టు
X
తెలంగాణ అసెంబ్లీ స్పీకరు మధుసూదనాచారి 'ఆ ఒక్కటీ అడక్కు' అంటున్నారట... ఎవరు దేనికి సంబంధించి తనను కలిసినా సానుకూలంగా స్పందించే మంచి వ్యక్తయిన మధుసూదనుడు ఒక్క విషయంలో మాత్రం తల అడ్డంగా ఊపుతారట... స్పీకర్ మధుసూదనాచారి వద్ద ఎవరైనా తలసాని అంటే చాలు ఆయన తల అడ్డంగా ఊపుతున్నారట.. అయినా పాపం.. ఆశ చావని టీడీపీ, కాంగ్రెస్ నేతలు తరచూ ఆయన్ను కలిసి తలసాని రాజీనామా ఆమోదించడంటూ కోరుతున్నారు. తాజా మర్రి శశిధరరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు వెళ్లి ఆయన్ను కలిశారు.. తలసాని విషయంలో ఆయన ముందు ఎంతగా గొంతు చించుకున్నా అది చెవిటివాని ముందు శంఖం ఊదినట్లేనని అక్కడి నుంచి బయటకొచ్చిన కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ రాజీనామా వ్యవహారంపై మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి స్పీకర్ మధుసూదనాచారి కలిశారు. తలసానిని మంత్రిగా కొనసాగించడం రాజ్యంగ విరుద్దం, అనైతికం అని చెబుతూ.... తలసాని రాజీనామాను వెంటనే ఆమోదించాలని స్పీకర్ ను మర్రి కోరారు. అంతేకాదు... ఇలా రాజీనామాను నెలల తరబడి పెండింగులో ఉంచడం సరికాదని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన స్పీకర్ కు తెలిపారు. ఇంకో మంత్రి కడియం శ్రీహరి లోక్ సభకు రాజీనామా చేస్తే వెంటనే స్పీకర్ ఆమోదించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. కడియం రాజీనామా ఆమోదించినవారు తలసాని రాజీనామా ఎందుకు ఆమోదించరని ఆయన ప్రశ్నించారు. కాగా మరో మాజీ మంత్రి గద్వాల ఎమ్మెల్యే డి.కె. అరుణ కూడా తలసాని రాజీనామా అంశంపై ప్రశ్నించారు. వీళ్లు ఎంతగా అడిగా స్పీకరు మాత్రం మౌనముద్రే దాల్చారట. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయని చెప్పినా కూడా ఆయన కేసీఆరే మాకు సుప్రీంకోర్టు.. ఆయన మార్గదర్శకాల ప్రకారమే నడుచుకుంటున్నాను అన్నట్లుగా చూశారట.