Begin typing your search above and press return to search.

'భోగాపురం' దోపిడీతో చంద్ర‌బాబు వై 'భోగం'!

By:  Tupaki Desk   |   18 Aug 2018 4:27 AM GMT
భోగాపురం దోపిడీతో చంద్ర‌బాబు వై భోగం!
X
గ‌త నాలుగేళ్లుగా ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడి హ‌యాంలో టీడీపీ నేత‌లు అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని ప్ర‌జ‌లు - ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. విశాఖ‌లో భూదందాలు మొద‌లుకొని నిన్న గుర‌జాల అక్ర‌మ మైనింగ్ వ‌ర‌కు టీడీపీ నేత‌లు ఎన్నో అవినీతి కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డ్డార‌ని ప్ర‌తిపక్షాలు ఆరోపించిన విష‌యం విదిత‌మే. ప్ర‌భుత్వ అవినీతిపై ప్ర‌తిప‌క్ష వైసీపీ ఎన్నో సార్లు విమ‌ర్శ‌లు గుప్పించింది. చంద్ర‌బాబు పాల‌న‌పై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప‌లు మార్లు తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌ నిర్మాణ టెండర్ల‌లో ప్ర‌భుత్వం కుట్ర‌పై ఆయ‌న మండిప‌డ్డారు. భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌ నిర్మాణ టెండర్ లో పాల్గొనకుండా ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)ని చంద్ర‌బాబు స‌ర్కార్ నిషేధించింద‌ని ఆయ‌న ఆరోపించారు. కేవలం ప్రైవేట్‌ సంస్థలను మాత్రమే టెండర్ కు అర్హులని చేసిన చంద్రబాబు నిర్ణ‌యంపై విజ‌య సాయి రెడ్డి నిప్పులు చెరిగారు.

గతంలో భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌ నిర్మాణ టెండర్ ను ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీ (ఏఏఐ) దక్కించుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే, కమీషన్లు దండుకునే వీలుండ‌ద‌నే కార‌ణంతో చంద్ర‌బాబు కుంటిసాకులు చెప్పి ఏఏఐ టెండ‌ర్ ను ర‌ద్దుచేశార‌ని విజయసాయిరెడ్డి మండిప‌డ్డారు. తాజాగా మ‌రోసారి జారీ చేసిన టెండర్‌ లో అసలు ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీ పాల్గొనకుండా చంద్ర‌బాబు స‌ర్కార్ నిషేధం విధించ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రైవేట్‌ కంపెనీల‌తో కుమ్మక్కైన చంద్ర‌బాబు....క‌మీష‌న్ల కోస‌మే ఈవిధంగా చేశార‌ని ఆరోపించారు. తన ఆరోపణలు నిజం కాదని చంద్రబాబు చెప్పగలరా అని ప్ర‌శ్నించారు. త‌మ‌కు అనుకూల కంపెనీల‌కు టెండ‌ర్ క‌ట్ట‌బెట్టేందుకు టీడీపీ స‌ర్కార్ సిద్ధ‌ప‌డింద‌ని విజ‌య సాయి రెడ్డి ఆరోపించారు. ఎక్కువ రెవెన్యూ వాటా ఇస్తామని ఏఏఐ చెప్పినా దాని టెండర్లను చంద్ర‌బాబు ఎందుకు రద్దు చేశారో చెప్పాల‌ని నిల‌దీశారు. మూడు దశల్లో రూ. 4,209 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించనున్న ఈ ఎయిర్‌ పోర్ట్‌ నిర్మాణ ప్రాజెక్ట్ లో వందల కోట్లు దోపిడీ చేసేందుకు టీడీపీ స‌ర్కార్ కుట్ర ప‌న్నుతోంద‌ని ఆరోపించారు.