Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను ఏసుకున్న ఏపీ ఎంపీ

By:  Tupaki Desk   |   1 July 2016 11:41 AM GMT
కేసీఆర్ ను ఏసుకున్న ఏపీ ఎంపీ
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒక మాట అనటం అంత తేలికైన విషయం కాదు. ఆయన్ను ఒక మాట అనాలంటే వెనుకా ముందు కాస్త చూసుకోవాల్సిందే. ఎందుకంటే.. ఆయన ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు మరి. అన్నింటికి మించి ఆయనకు ఒకసారి ఒక ఇంప్రెషన్ పడ్డాక దాని పరిణామాల్నిఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇన్నిపంచాయితీలు ఉంటాయి కాబట్టే.. తొందరపడి కేసీఆర్ ను అనేందుకు ఏపీ రాజకీయ నేతలు తొందరపడరని చెబుతారు.

హైదరాబాద్ లో ప్రతి ఒక్క ఏపీ నేతకు ఎంతోకొంత సంబంధాలు ఉన్న నేపథ్యంలో.. ఆయనపై తొందరపడి మాట అనే కన్నా.. ఆచితూచి అనేందుకే మొగ్గు చూపుతారు. ఇదేం లేకుండా మౌనంగా ఉండటానికి మరింత ప్రాధాన్యత ఇస్తారు. ఇలాంటి కారణాల వల్లే.. ఢిల్లీలోని ఏపీ భవన్ తమదేనని అన్నా.. ఏపీ అధికారపక్ష నేతలు తొందరపడి నోరు విప్పరు. అలాంటిది.. తాజాగా ఒక ఏపీ ఎంపీ కేసీఆర్ మీద విరుచుకుపడ్డారు. అది కూడా హైకోర్టు విభజన లాంటి సున్నిత అంవం మీదన కావటం గమనార్హం.

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎంపీ రవీంద్ర తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక దేశంగా భావిస్తున్నారని.. దాన్నో రాష్ట్రంగా ఆయన అనుకోవటం లేదని ఫైర్ అయ్యారు. హైకోర్టు విభజన ఇష్యూలో కేసీఆర్ తన హోదాకు తగ్గట్లుగా ఆయన వ్యవహరించలేదన్నారు. ఏపీ ప్రజల మీద కేసీఆర్ ఇంకా విషం చిమ్ముతున్నారంటూ మండిపడ్డారు. సీఎం హోదాకు తగ్గట్లు కాకుండా విషం చిమ్మేలా వ్యాఖ్యలు చేయటానికి మించిన దుర్మార్గం ఏముంటుందని రవీంద్ర ఫైర్ అయ్యారు. హైకోర్టు విభజన విషయంలో ఏపీలో అంతమంది నేతలు ఉన్నా.. రవీంద్ర తరహాలో ఒకరిద్దరు తప్పించి మిగిలిన వారంతా మౌనంగా ఉన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏపీ నేతలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే అంత వణుకా?