Begin typing your search above and press return to search.

ఏపీలో ముగ్గురు, తెలంగాణలో ఒక్కరు... అంతా ఏకగ్రీవమే

By:  Tupaki Desk   |   19 Aug 2019 5:24 PM GMT
ఏపీలో ముగ్గురు, తెలంగాణలో ఒక్కరు... అంతా ఏకగ్రీవమే
X
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. ఏపీలో మూడు స్థానాలు, తెలంగాణలో ఒక స్థానం భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కాగా.. రెండు రాష్ట్రాల్లో మొత్తం నాలుగు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు ఏకగ్రీవంగానే ముగిశాయి. ఈ నాలుగు స్థానాలు కూడా రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలకు చెందిన నేతలకే దక్కడం విశేషం. ఏపీలో మూడు, తెలంగాణలో ఒక్క స్థానానికి జరిగిన ఎన్నికలు ముగిసినట్లు సోమవారం రెండు రాష్ట్రాల అసెంబ్లీ కార్యదర్శులు ప్రకటించారు.

ఏపీలో మొత్తం మూడు స్థానాలకు ఎన్నికలు జరగగా... ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలైనందున ఆ మూడు స్థానాలు కూడా అదికార వైసీపీకే దక్కాయి. ఈ మూడు స్థానాలకు మంత్రి మోపిదేవి వెంకటరమణ, చల్లా రామకృష్ణారెడ్డి, మహ్మద్ ఇక్బాల్ పేర్లను ఎంపిక చేసింది. ఈ మేరకు వారు ఇదివరకే నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల గడువు ముగిసేనాటికి మూడు స్థానాలకు గానూ ఈ ముగ్గురే నామినేషన్లు దాఖలు చేయడంతో వీరు ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అసెంబ్లీ కార్యదర్శి సోమవారం ప్రకటించారు.

ఇక తెలంగాణ విషయానికి వస్తే... ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఒకే ఒక్క స్థానానికి నోటిఫికేషన్ జారీ కాగా... మెజారిటీ పరంగా ఆ స్థానం అధికార పార్టీ టీఆర్ఎస్ కే దక్కే ఛాన్సుంది. ఈ క్రమంలో ఈ సీటును మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి కేటాయించింది. టీఆర్ఎస్ ఆధిష్ఠానం ఆదేశాల మేరకు గుత్తా ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడ కూడా ఎన్నిక ఒకే సీటుకు జరగనుండగా, ఒక్కరే నామినేషన్ వేయడంతో గుత్తా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. మొత్తంగా రెండు రాష్ట్రాల్లో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగగా... నాలుగు స్థానాలకు కూడా పోలింగ్ అవసరం లేకుండా ఏకగ్రీవంగా ముగిశాయి. ఈ నాలుగు సీట్లు కూడా రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలకే దక్కడం గమనార్హం.