Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ గూటికి మ‌రో ఎమ్మెల్యే...సీనియ‌ర్‌ కే గాలం

By:  Tupaki Desk   |   13 Dec 2018 12:36 PM GMT
టీఆర్ ఎస్ గూటికి మ‌రో ఎమ్మెల్యే...సీనియ‌ర్‌ కే గాలం
X
హోరాహోరీగా సాగిన‌ తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ పోటీ చేసిన 119 స్థానాల్లో 88 చోట్ల గెలుపొందింది. ఎన్నికల ప్రక్రియ ముగిసినా టీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. తాజాగా ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా టీఆర్ ఎస్ లో చేరడంతో ఆ సంఖ్య 90 కి చేరింది. అయితే దీనికి కొన‌సాగింపుగా మ‌రో ఎమ్మెల్యే టీఆర్ ఎస్ పార్టీకి జై కొట్ట‌నున్నార‌ని తెలుస్తోంది.ఆయ‌నే కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర్ రావు.

తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో కొత్తగూడెం సిట్టింగ్ ఎమ్మెల్యే జ‌లగం వెంక‌ట్రావు నుంచి ఓడించి ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక‌య్యారు. జిల్లాలో కాంగ్రెస్ గెలిచిన రెండు స్థానాల్లో కొత్త‌గూడెం ఒక‌టి. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ ఎమ్మెల్యే అయిన వ‌న‌మా టీఆర్ ఎస్‌ కు మద్దతు ప్రకటించడానికి సిద్ధ‌మయ్యారని స‌మాచారం. మంత్రి కేటీఆర్‌ ను ఒక‌ట్రెండు రోజుల్లో ఆయ‌న క‌ల‌వ‌నున్నార‌ని స‌మాచారం.

కాగా, ఇప్ప‌టికే రామగుండం స్వతంత్ర ఎమ్మెల్యే కోరుగంటి చందర్‌రావు కేటీఆర్‌ తో సమావేశమయ్యారు. అనంతరం తాను టీఆర్ ఎస్‌ లో చేరుతున్నట్లు ప్రకటించారు. మరో స్వతంత్ర ఎమ్మెల్యే కూడా టీఆర్ ఎస్ లో చేరనున్నట్లు ప్రకటించారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా గెలిచిన రాముల్ నాయక్ కేటీఆర్ తో భేటీ అయ్యారు. అనంతరం తాను కూడా టీఆర్ ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు.