Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ పై కొత్త‌ ఆరోప‌ణ

By:  Tupaki Desk   |   3 Sep 2015 8:51 AM GMT
కేసీఆర్‌ పై కొత్త‌ ఆరోప‌ణ
X
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు...విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు ఆయ‌న‌కు కొత్త కాదు. ఉద్య‌మ‌నాయ‌కుడిగా ఉన్న‌పుడు సొంత పార్టీ నాయ‌కులు కూడా ఒకానొక ద‌శ‌లో అసంతృప్తితో కేసీఆర్‌ పై మండిప‌డ్డారు, పార్టీకి గుడ్‌ బై చెప్పారు. అయితే...ఇపుడు తెలంగాణ రాష్ర్టం సిద్ధించి... ముఖ్య‌మంత్రి హోదాలోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా కేసీఆర్ అదే రీతిలో ముందుకు వెళుతున్నారా? ఆయ‌న పార్టీ అయినా టీఆర్ఎస్‌ లో అసంతృప్తి జ్వాల‌లు ప్రారంభం అయ్యాయా? అది కూడా సాక్షాత్తు ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ పైనేనా? అంటే అవున‌నే అంటున్నారు.

కేసీఆర్ ప‌లు సంద‌ర్భాల్లో మాట్లాడుతూ...ప్రజలు, ప్రజా ప్రతినిధులందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు. అయితే గతంలో చెప్పిన మాటలకు, వాస్తవంలో జరుగుతున్న తీరుకు పొంతన లేకుండా ఉంద‌ని అంటున్నారు. ఆయన వ్యవహారశైలిపై సామాన్య జనం, విపక్షాలు విమర్శలు చేయటం ఒక ఎత్తయితే...స్వయంగా టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులే అసంతృప్తిని వ్యక్తం చేయటం మరో ఎత్తు. అటు క్యాంపు కార్యాలయంలో సీఎం అపాయింట్‌మెంట్లు ఇవ్వకపోవటం, ఇటు సచివాలయంలో అందుబాటులో లేకపోవటమే దీనికి కారణమని తెలుస్తోంది.

తాజాగా సచివాలయానికి వచ్చిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు సీఎంపై తీవ్రస్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేశారు. 'నియోజకవర్గంలో అనేక సమస్యలున్నాయి. ఏ ఒక్క పనీ జరగటం లేదు. ఈ విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నా. కానీ ఆయన అపాయింట్‌మెంట్‌ దొరకటం లేదు* అంటూ వాపోయారు. సచివాలయాని వచ్చినా ఉపయోగం లేకుండా పోతోంది. సెక్రటేరియట్‌ కు సీఎం, ఏ రోజు, ఎప్పుడొస్తారో తెలియట్లేదు. దీంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆయన రాకపోవటంతో నియోజకవర్గానికి చెందిన పెండింగ్‌ ఫైళ్లను అధికారులు పట్టించుకోవటం లేదు. వాటిని పరిష్కరించాలని కోరితే...సీఎం ఆమోదిస్తేనే ఫైలు మూవ్‌ చేస్తామంటూ అధికారులు చెబుతున్నారు. దీంతో గత్యంతరం లేక ఆ ఛాంబర్‌ నుంచి ఈ ఛాంబర్‌ కు, ఆ అధికారి దగ్గర్నుంచి ఈ అధికారి దగ్గరకు చెప్పులరిగేలా తిరుగుతున్నా. ఇంకా చెప్పాలంటే...అధికారులు సహకరించకపోవటంతో నేనే ఫైళ్లను చంకలో పెట్టుకుని తిరుగుతున్నా. అంతేకాదు సీఎంవోలోని కార్యదర్శులు సైతం మాకు స్పందించడం లేదు. ఎమ్మెల్యేల ఫోన్లనుకూడా వారు లిఫ్ట్‌ చేయడం లేదు* అంటూ ప‌రిస్థితిని వెళ్ల‌గ‌క్కారు. దీన్నిబట్టి టీఆర్‌ఎస్‌ కు చెందిన ప్రజా ప్రతినిధులు సీఎం వ్యవహారశైలిపట్ల ఎలాంటి భావనతో ఉన్నారనే విషయం తెలిసిపోతోంది.

ప్రజా ప్రతినిధుల పరిస్థితి ఈ విధంగా ఉంటే... ఉన్నతాధికారులు, అధికారుల పరిస్థితి మరోలా ఉంది. వివిధ అంశాలు, నిర్ణయాల్లో వారి పరిస్థితి 'కక్కలేక, మింగలేక' అన్నట్టుగా తయారైంది. పెండింగ్‌ ఫైళ్ల విషయంలో ఈ ప‌రిస్థితి ఉంది. విధానపరమైన నిర్ణయాలు తీసుకునే క్రమంలో సీఎంకు ఉన్నతాధికారులు అన్ని వివరాలు తెలపాల్సి ఉంటుంది. కానీ ఆ అవకాశం తమకు దొరకటం లేదని ఓ ఉన్నతాధికారి ఆవేదన వ్యక్తం చేశారు.

మొత్తంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి త‌న కార్యాల‌యంలో అందుబాటులో ఉండ‌క‌పోవ‌డం అనేది అధికారుల‌కే కాదు... ప్ర‌జాప్ర‌తినిధుల‌కు సైతం ఇబ్బందిగా మారింది.