Begin typing your search above and press return to search.

ఏపీఐఐసీ చైర్మన్ గా రోజా.. తొలిపలుకే సంచలనం

By:  Tupaki Desk   |   15 July 2019 11:58 AM GMT
ఏపీఐఐసీ చైర్మన్ గా రోజా.. తొలిపలుకే సంచలనం
X
మంత్రి పదవి చేపట్టి ఫైర్ బ్రాండ్ గా ఏపీలో పాలిస్తుందని అందరూ అనుకుంటే ఆ పదవి దక్కలేదు వైసీపీ ఎమ్మెల్యే రోజాకు. అంతటితో నిరాశ చెందకుండా పార్టీలో తన పని తాను చేసుకుపోయింది. సామాజిక కోణంలోనే రోజాకు మంత్రి పదవి దక్కలేదని.. జగన్ సహా నేతలు అనునయించి ఆమెకు ఏపీఐఐసీ చైర్మన్ గా నియమించారు. కొద్దిరోజుల క్రితమే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. సోమవారం సాయంత్రం రోజా ఏపీఐఐసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టగానే రోజా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముందుగా తనను ఏపీఐఐసీ చైర్మన్ గా నియమించిన సీఎం జగన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో పరిశ్రమలను తీసుకొచ్చి బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పెట్టుబడులు తీసుకువచ్చేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తానని తెలిపారు.

ఇక పరిశ్రమలలో స్థానికంగా ఉండే యువతకే 75శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రోజా సంచలన హామీ ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఈ హామీ బుట్టదాఖలైందని.. తాము ఖచ్చితంగా అమలు చేసి చూపించేందుకు రిజర్వేషన్లు తేబోతున్నట్టు ప్రకటించారు.. రాష్ట్రంలో విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా అద్భుతంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతానని తన ప్రణాళికలను రోజా వివరించారు.

రోజా ప్రమాణ స్వీకారానికి ఎండీ ప్రతాప్ - వైసీపీ ఎమ్మెల్యే భూమన- ఆమె భర్త సెల్వమణి.. అధికారులు , పలువరు కార్యకర్తలు హాజరై ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.