Begin typing your search above and press return to search.

ఎంఐఎం టార్గెట్‌ ను గ‌మ‌నించారా?

By:  Tupaki Desk   |   31 May 2016 8:06 AM GMT
ఎంఐఎం టార్గెట్‌ ను గ‌మ‌నించారా?
X
యావత్తు దేశంలోనే ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తన సత్తా చాట్టాలని హైద‌రాబాదీ పార్టీ ఎంఐఎం యోచిస్తోంది. తద్వారా జాతీయ రాజకీయాలలో కీలకంగా మారాలని ఆ పార్టీ స్కెచ్ వేస్తోంది. ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో రాణించిన ప్రతిపార్టీ జాతీయ రాజకీయాలలో కీలకంగా మారుతున్నారన్న వాస్తవాన్ని గ్రహించిన ఎంఐఎం నాయకత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్‌లో వచ్చే సాధారణ ఎన్నికల్లో అన్ని స్థానాలలో పోటీచేస్తామని ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇటీవల బీహార్ రాష్ట్రంలో ఒంటరిగా పోటీచేసి దెబ్బతిన్న మజ్లిస్ పార్టీ నాయకత్వం ఉత్తరప్రదేశ్ అసెంబ్ల్లీ ఎన్నికలు ఆ అనుభావాలు ఎదురుకాకుండా ఇప్పటినుంచే వ్యూహాలను పదును పెడుతున్నట్లు సమాచారం.

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోకీలకంగా ఉన్న ముస్లిం జనాభాతోపాటు దళిత, బహుజన జనాభాను ఆకర్షించే విధంగా ఎంఐఎం నాయకత్వం చ‌ర్చ‌లు మొద‌లుపెట్టిన‌ట్లు స‌మాచారం. వచ్చే ఏడాది వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు గానూ ఉత్తరప్రదేశ్‌లో పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ఇప్పటినుంచే సమాయత్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను అనధికారికంగా ఇప్పటినుంచే చేపట్టే దిశగా మజ్లిస్‌నాయకత్వం వ్యూహం రచిస్తోంది. ముస్లిం - దళిత జనాభా అధికంగా ఉన్న చోట అవకాశమున్న చోట ముస్లిం అభ్యర్థులను నిలపాలని భావిస్తున్నట్లు సమాచారం. దళితులు అధికంగా ఉండి ఆ తరువాత జనాభాలో ముస్లింలు ఎక్కువగా ఉన్న చోట దళిత - బహుజన అభ్యర్థులకే అవకాశమివ్వాలని మజ్లిస్ నాయకత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ రకమైన ఫార్ములాతో ముందుకెళ్లినప్పుడే ఉత్తరప్రదేశ్‌ లో బలంగా ఉన్న బహుజన సమాజ్‌ వాది - అధికార పార్టీ అయిన సమాజ్‌ వాది పార్టీలను ధీటుగా ఎదుర్కోగలమని మజ్లిస్ నాయకత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

యూపి అసెంబ్లీలో కాలుమోపడం ద్వారా వచ్చే దేశ సార్వత్రిక ఎన్నికల నాటికి అక్కడినుంచి మెజార్టీ ఎంపీ స్థానాలను కైవసం చేసుకొనే దిశగా ఎంఐఎం పార్టీ నాయకత్వం పావులు కదుపుతోంది. ఇంతవరకు ఎంఐఎం కేవలం ఒక్క ఎంపీ స్థానంతోనే తన చక్రం తిప్పే ప్రయత్నాలు కొనసాగించిన విషయం తెలిసిందే. ఇప్పటినుంచి వచ్చే ప్రతి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఆపై మెజార్టీ ఎంపీ స్థానాల్లో గెలవాలన్న లక్ష్యంతో ఎంఐఎం ముందుకెళ్తున్నట్లు సమాచారం. దేశంలో వచ్చే సార్వత్రిక ఎన్నికలనాటికి కనీసంగా రెండు డిజిట్ల ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని, తద్వారా జాతీయ రాజకీయాలను శాసించాలని ఎంఐఎం పార్టీ యోచిస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల స‌మ‌యంలో రిజర్వేషన్లపై బిజెపి మాతృసంస్థ రేపిన వివాదంతో ఓట్లు ఏకపక్షంగా ఆర్‌ జేడి - జేడియూలకు పడ్డాయని ఎంఐఎం అంచనా వేస్తోంది. ఆ పరిస్థితులకు భిన్నంగా నేడు యూపిలో వాతావరణం నెలకొందని, ముజఫర్ నగర్ అల్లర్లను నియంత్రించడంలో, ఆర్ ఎస్ ఎస్ శక్తుల నియంత్రణలో అక్కడి సమాజ్‌ వాది పార్టీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎంఐఎం పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో సమాజ్‌ వాది పార్టీ పక్షాన నిలిచిన ముస్లిం ఓటర్లు ఇక ఆ పార్టీ వెంటే ఉంటారన్న నమ్మకం లేకుండా పోయిందని ఎంఐఎం నేతల అంచనా. ఇదే సందర్భంలో ముస్లింలు - దళితుల విశ్వాసాన్ని పూర్తిస్థాయిలో బిఎస్‌ పి సైతం పొందలేకపోతోందని ఈ తరుణంలో తమ పార్టీ దళిత - ముస్లిం సమ్మిళిత విధానంతో ఎన్నికల గోదాలోకి దిగితే మాత్రం అద్భుత ఫలితాలు వస్తాయని ఎంఐఎం అధినాయకత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్ర‌మంలో ముందస్తూ వ్యూహంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయా వర్గాల్లోని ఏ నేతకు ఆదరణ ఉందన్న సర్వే నివేదికల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఎంఐఎం చూపు మార‌డం దేశ‌రాజ‌కీయాల ఫ‌లితాల‌ను త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.