Begin typing your search above and press return to search.

సైలెంట్ ఓటింగ్.. టీఆర్ ఎస్ కు వ్యతిరేకమేనా?

By:  Tupaki Desk   |   12 April 2019 8:51 AM GMT
సైలెంట్ ఓటింగ్.. టీఆర్ ఎస్ కు వ్యతిరేకమేనా?
X
ఆంధ్రప్రదేశ్ లో ఈసారి ‘వాయిలెంట్ పోలింగ్’ జరిగింది. ఈవీఎంల మొరాయింపులు. టీడీపీ - వైసీపీ దాడులు - ప్రతిదాడులు - విధ్వంసాలు - గొడవలు బీభత్సమైన వాతావరణంలో ఎన్నికలు దారుణంగా ముగిశాయి. అదే తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ఒకటి రెండు చోట్ల తప్పితే అస్సలు ఈవీఎంలు మొరాయించలేదు. పార్లమెంట్ ఎన్నికలను జనాలు లైట్ తీసుకోవడంతో మిట్ట మధ్యాహ్నం వేళ పోలింగ్ కేంద్రాల్లో జనాలే లేకుండా పోయింది. తెలంగాణలో నిన్న మొత్తం ‘సైలెంట్ పోలింగ్’ జరిగింది.

తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 75శాతానికి పైగా పోలింగ్ జరగ్గా.. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 63శాతం మాత్రం పోలింగ్ జరగడం గమనార్హం.హైదరాబాద్ పరిధిలోని మూడు లోక్ సభ స్థానాలైన సికింద్రాబాద్ - మల్కాజిగిరి - హైదరాబాద్ లలో 40శాతంలోపే పోలింగ్ నమోదైంది. ఈ సైలెంట్ ఓటింగ్ అధికార టీఆర్ ఎస్ పార్టీకి గుబులు రేపుతోంది.

ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 16 ఎంపీ సీట్లు గెలుచుకొని కేంద్రంలో చక్రం తిప్పాలని కేసీఆర్ భావించాడు. కానీ ప్రస్తుతం తెలంగాణలో సైలెంట్ ఓటింగ్ తర్వాత టీఆర్ఎస్ కు 10సీట్లకు మించి వస్తాయా రావా అన్న అంచనాకు వస్తున్నారట..

రాజకీయ విశ్లేషకులు చెబుతున్న అంచనా ప్రకారం.. తెలంగాణలో ఇటీవల డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70శాతానికి పైగా ఓటింగ్ జరిగింది. ఇప్పుడు పోలింగ్ శాతం బాగా తగ్డడంతో కాంగ్రెస్ , బీజేపీలకు కలిసి వస్తుందని ఆ రెండు పార్టీలు కనీసం ఐదు , లేదా ఆరు సీట్లలో గెలువవచ్చని అంటున్నారు.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన చాలా మంది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేయలేదు. పైగా డబ్బు, మద్యం లాంటి ప్రవాహాలు తెలంగాణలో జరగలేదు. దీంతో గులాబీ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న ఓటర్లు చాలామంది ఈసారి నిరాసక్తతతో ఓటు వేయలేదు. ఆ ప్రభావం ఆ పార్టీ పుట్టిముంచేలా ఉంది. యాంటి ఓటర్లు మాత్రం టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోలింగ్ బూత్ లకు వెళ్లి ఓటేశారంటున్నారు. అందుకే పోలింగ్ శాతం తగ్గడం తమకు కలిసివస్తుందని బీజేపీ కాంగ్రెస్ లు భావిస్తున్నాయి.

ప్రాథమిక విశ్లేషణల ప్రకారం.. సికింద్రాబాద్ - మల్కాజిగిరి - చేవెళ్ల - కరీంనగర్ - నిజామాబాద్ - ఖమ్మం లేదా భువనగిరిలల్లో గులాబీ పార్టీ గెలుపు అంత ఈజీ కాదని విశ్లేషణలు సాగుతున్నాయి. మరి మే 23న వెలువడే ఫలితాల్లో గులాబీ పార్టీ మొత్తం 16 సీట్లు సాధిస్తుందో లేదో చూడాలి మరి..