Begin typing your search above and press return to search.

ముంబ‌యిలో ఆ డూప్లెక్స్ రూ.160కోట్లు!

By:  Tupaki Desk   |   26 Nov 2015 9:20 AM GMT
ముంబ‌యిలో ఆ డూప్లెక్స్ రూ.160కోట్లు!
X
భార‌త స్థిరాస్థి రంగంలో కొత్త రికార్డులు న‌మోద‌వుతున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో ఖ‌రీదైన ఫ్లాట్ల అమ్మ‌కాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఇలానే అమ్ముడైన ఒక డూఫ్లెక్స్ ఇంటి వ్య‌వ‌హారం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ముంబ‌యిలోని రిల‌య‌న్స్ అధినేత ముఖేశ్ అంబానీ నివాస‌మైన ఆంటీలియాకు స‌మీపంలో 24 అంత‌స్తుల్లో ఒక భారీ భ‌వ‌నాన్ని నిర్మిస్తున్నారు. దీన్లోని ఒక డూఫ్లెక్స్ ఫ్లాట్ ధ‌ర ఏకంగా రూ.160కోట్లు ప‌ల‌క‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

దాదాపు 10వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో నిర్మిత‌మైన ఈ ఫ్లాట్ ను జిందాల్ ఫార్మా వ్యాపారం నిర్వ‌హిస్తున్న జిందాల్ ఫ్యామిలీ దీన్ని కొనుగోలు చేసిన‌ట్లుగా చెబుతున్నారు. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన రియ‌ల్ వ్య‌వ‌హారంలో ఇదే అతి పెద్ద డీల్ గా చెబుతున్నారు. ఈ భారీ ధ‌ర‌ను చూస్తే.. ఒక్కో చ‌ద‌ర‌పు అడుగుకు రూ.1.6ల‌క్ష‌ల ధ‌ర ప‌లికిన‌ట్లైంది.

ఇంత భారీ ధ‌ర ప‌లికిన ఫ్లాట్ నిర్మాణం పూర్తి కావ‌టానికి మ‌రో 18 నెల‌లు ప‌డుతుంద‌ని చెబుతున్నారు. ఇప్పుడున్న అంచ‌నా ప్ర‌కారం 2017 ఏప్రిల్‌నాటికి ఈ డూఫ్లెక్స్ ఇంటి నిర్మాణం పూర్తి అవుతుంద‌ని చెబుతున్నారు. గ‌త ఏడాది సెప్టెంబ‌రులో బ్రీచ్‌ కాండీలో సైర‌స్‌ పూనావాలా రూ.750 కోట్ల‌తో ఒక ప్రైవేటు భ‌వంతిని కొనుగోలు చేశారు. అప్ప‌ట్లో ఈ కొనుగోలు సంచ‌ల‌నం సృష్టించింది. ప్రైవేటు భ‌వ‌నం కొనుగోలులో అదో రికార్డు అయితే.. అపార్ట్‌ మెంట్ లో ఒక డూఫ్లెక్స్ ఫ్లాట్ కు రూ.160కోట్లు ప‌ల‌క‌టం తాజా సంచ‌ల‌నంగా మారింది.