Begin typing your search above and press return to search.

కాంగ్రెస్, బీజేపీ జుట్టు.. వీళ్ల చేతుల్లోనే

By:  Tupaki Desk   |   18 May 2019 6:11 AM GMT
కాంగ్రెస్, బీజేపీ జుట్టు.. వీళ్ల చేతుల్లోనే
X
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా దేశాన్ని పాలించిన పార్టీలకు ఉత్తర భారతమే అండగా నిలుస్తూ వచ్చింది. ఉత్తర భారతదేశానికి చెందిన వారే ఎక్కువశాతం ప్రధానులుగా కొనసాగారు. అటు గాంధీ ఫ్యామిలీ నుంచి ఇటు బీజేపీ నేతల వరకూ అంతా ఉత్తరాది వారే. మధ్యలో ఒకటిరెండు సార్లు మాత్రమే దక్షిణాదికి అవకాశం దక్కింది. మన తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు ప్రధానిగా సత్తా చాటారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని సంక్షోభం నుంచి అభివృద్ధి వైపు అడుగులు వేయించారు.

అయితే ఎంతో సత్తా ఉన్నప్పటికీ దక్షిణాది వారు దేశాన్ని ఏలకపోవడానికి ప్రధాన కారణం ఇక్కడి ప్రాంతీయ పార్టీలే. తమిళనాడు, ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక, కేరళలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు అడ్రస్ గల్లంతైంది. అందుకే ఉత్తరాది బలంపైనే అవి నెగ్గి అక్కడివారినే ప్రధానులుగా నిర్ణయిస్తూ ఆదిపత్యం చెలాయిస్తున్నాయి.

అయితే ఇప్పుడు 2019 వేళ కాలం మారింది. కేంద్రంలోని బీజేపీకి హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. కుచించుకుపోయిన కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో అధికారాన్ని బీజేపీ నుంచి లాగేసుకుంది. ఉత్తర భారతం మొత్తం కాంగ్రెస్, బీజేపీలు చెరిసగం సీట్లు పంచుకొని హంగ్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల వేళ దక్షిణాది పార్టీలే కీరోల్ గా మారాయి. భావి ప్రధానిని నిర్ణయించడంలో సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేయడంలో ప్రాంతీయ పార్టీలే కీలకమనడంలో ఎలాంటి సందేహం లేదు.

దక్షిణాదిన ఆంధ్రాలో చంద్రబాబు, జగన్ కీలకంగా ఉన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ హవా ఉంది. తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకే, కేరళలో కమ్యూనిస్టులు, కర్ణాటకలో జేడీఎస్ ఆధిపత్యం ఉంది. ఒక్క కర్ణాటకలో తప్పితే జాతీయ పార్టీల ఉనికి నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లో లేదు. ఈ నేపథ్యంలో హంగ్ కునుక వస్తే దేశంలో దక్షిణాది పార్టీలదే కీరోల్. అందుకే కాంగ్రెస్, బీజేపీ జాతీయ నేతల నుంచి జాతీయ మీడియా దాకా ఇప్పుడు దృష్టి అంతా దక్షిణాది వైపే మళ్లింది. దక్షిణాది పార్టీల మద్దతు ఎటు అనేదానిపై చర్చోపచర్చలు చేస్తున్నాయి. ఈసారి ఉత్తరాది కంటే కూడా దక్షిణాది పైనే అందరి దృష్టి నెలకొంది.