Begin typing your search above and press return to search.

బిట్‌ కాయిన్‌ లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..

By:  Tupaki Desk   |   13 Dec 2017 5:26 PM GMT
బిట్‌ కాయిన్‌ లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..
X
డిజిటల్ కరెన్సీ బిట్‌ కాయిన్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆదాయపన్నుశాఖ అధికారులు దేశంలోని అన్ని ప్రముఖ బిట్‌ కాయిన్ ఎక్స్‌ చేంజ్ కేంద్రాల వద్ద సర్వే నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఆన్‌ లైన్ ఫ్లాట్‌ ఫామ్‌ పై బిట్‌ కాయిన్ ట్రేడింగ్ జోరుమీదుంది. ఇటీవల క్రిప్టో కరెన్సీ బిట్‌ కాయిన్ ట్రేడింగ్‌ లో పదివేల డాలర్ల మార్క్‌ ను కూడా దాటింది. కానీ భారత ప్రభుత్వం మాత్రం బిట్‌ కాయిన్‌ కు ఇంకా గుర్తింపు ఇవ్వలేదు. బిట్‌ కాయిన్ ఇన్వెస్టర్లకు ఇటీవల ఆర్బీఐ కూడా హెచ్చరికలు జారీ చేసింది. బ్లాక్‌ చెయిన్ టెక్నాలజీ ద్వారా బిట్‌ కాయిన్ లావాదేవీలు జరుగుతున్నాయి.

బెంగుళూరుకు చెందిన ఐటీశాఖ ఈ స‌ర్వేలు చేప‌ట్టింది. దేశంలోని మొత్తం 9 కేంద్రాల వ‌ద్ద ఈ స‌ర్వే నిర్వ‌హించారు. ఢిల్లీ - బెంగుళూరు - హైద‌రాబాద్‌ - కొచ్చి - గురుగ్రామ్ ప్రాంతాల్లో ఇవాళ ఉద‌యం నుంచి స‌ర్వే కొన‌సాగుతోంది. ఆదాయ‌ప‌న్ను శాఖ చ‌ట్టంలోని 133ఏ ప్ర‌కారం ఈ స‌ర్వే నిర్వ‌హిస్తున్నారు. బిట్‌ కాయిన్‌ ఇన్వెస్ట‌ర్లు - ట్రేడ‌ర్ల స‌మాచారాన్ని సేక‌రిస్తున్నారు. ఇన్వెస్ట‌ర్లు ఎలాంటి లావాదేవీ నిర్వ‌హించారు - కౌంట‌ర్‌ పార్టీల‌ను గుర్తించ‌డం - ఎటువంటి బ్యాంక్ అకౌంట్‌ ను వాడుతున్నార‌న్న అంశాన్ని ఆరా తీస్తున్నారు. బిట్‌ కాయిన్ దందా నిర్వ‌హిస్తున్న వారు ఎటువంటి ఫైనాన్షియ‌ల్ డేటాను వాడుతున్నార‌న్న అంశాన్ని కూడా అధికారులు ప‌రిశీలిస్తున్నారు.

ప్రస్తుతం భారత్‌ లో బిట్‌ కాయిన్ డిమాండ్ ఎక్కువగా ఉంది. బిట్‌ కాయిన్ కొనేందుకు భారతీయ ట్రేడర్లు ఆసక్తి చూపుతున్న అంశాన్ని ఆర్బీఐ గుర్తించింది. భారత్‌ లో మొత్తం 11 బిట్‌కాయిన్ ట్రేడింగ్ ఆన్‌ లైన్ సైట్లు ఉన్నాయి. ఆ సైట్ల ద్వారా సుమారు 30వేల మంది కస్టమర్లు రెగ్యులర్‌ గా ట్రేడింగ్ నిర్వహిస్తున్నారు. ఒక్క క్లిక్‌ తో ఎవరైనా అకౌంట్‌ ను ఓపెన్ చేసి ఇన్వెస్టర్‌ గా మారిపోవచ్చు. అయితే బిట్‌ కాయిన్ ట్రేడింగ్ జోరుపై భారత అధికారి మరోరకమైన వివరణ కూడా ఇచ్చారు. బిట్‌ కాయిన్‌ కు వస్తున్న ఆదరణతో జనం ఎథీరమ్ - లైట్‌ కాయిన్ లాంటి ఇతర డిజిటల్ కరెన్సీల పట్ల ఆసక్తి చూపుతున్నారని కూడా స్పష్టమైంది. బిట్‌ కాయిన్ జోరుపై గ‌తంలో ఆర్బీఐ ఆందోళ‌న కూడా వ్య‌క్తం చేసింది.

వ‌ర్చువ‌ల్ క‌రెన్సీ బిట్‌ కాయిన్ చూపిస్తున్న దూకుడును ప‌రిశీలించేందుకు ఈ ఏడాది మార్చిలోనే కేంద్ర ఆర్థిక‌మంత్రిత్వ శాఖ ఓ క‌మిటీని ఏర్పాటు చేసింది. బిట్‌ కాయిన్ భ‌విష్య‌త్తుపై ఇంట‌ర్ డిసిప్లిన‌రీ క‌మిటీ త్వ‌ర‌లో నివేదిక ఇవ్వ‌నుంది.