Begin typing your search above and press return to search.

నితీశ్‌ కు మొద‌టి ప‌రీక్ష‌

By:  Tupaki Desk   |   28 Nov 2015 5:52 AM GMT
నితీశ్‌ కు మొద‌టి ప‌రీక్ష‌
X
బీహార్ సీఎంగా ప‌గ్గాలు చేప‌ట్టిన నితీశ్‌ కుమార్ మొద‌టి ప‌రీక్ష‌కు సిద్ధ‌ప‌డుతున్నారా? ఆ పరీక్ష‌ను త‌న‌కు తానుగా నిర్దేశించుకున్నారా? నితీశ్‌ కుమార్ వ్య‌క్తిత్వం వ‌ల్లే ఈ స‌మ‌స్య వ‌చ్చిప‌డుతోందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.

బీహార్‌ లో తిరిగి అధికారం కట్టబెడితే మద్యపానాన్ని నిషేధిస్తాం... ఇది ఎన్నికల సమయంలో జనతాదళ్ యునైటెడ్ పార్టీ త‌ర‌ఫున‌ మహిళా ఓటర్లకు ఇచ్చిన హామీ. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్న మహిళా ఓటర్లు... జేడీయూ నేతృత్వంలోని మహాకూటమికి పట్టం కట్టారు. బంపర్ మెజార్టీతో బీహార్‌ పీఠం కైవసం చేసుకున్న నితీశ్‌ కుమార్ ఎన్నికల హామీని అమలు చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి మద్యపానాన్ని నిషేధం అమ‌లులోకి రానుంది. అయితే లిక్కర్ - కల్లు మాఫియాకు కేరాఫ్‌ గా ఉన్న బీహార్‌ లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయడం సాధ్యమేనా...? మహిళలను మెప్పించడానికి నితీశ్ చేసిన ప్రకటన నిజంగా అమలవుతుందా...అనే సందేహాలు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మద్యపానాన్ని నిషేధిస్తే... దొంగదారుల్లో అమ్మే అవకాశాలు లేకపోలేదని సీఎం హోదాలో ఉన్న‌ నితీశ్‌ కుమారే అన్నారంటే.. బీహార్‌ లో పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. మ‌రోవైపు ఆర్థికంగా కూడా భారం పడనుంద‌ని ఆ రాష్ర్ట అధికారులు పేర్కొంటున్నారు. లిక్కర్‌ ను బ్యాన్ చేయ‌డం ద్వారా బీహార్ ఖజానాకు 4వేల కోట్ల ఆదాయం ఆగిపోతుందని వివ‌రిస్తున్నారు. బీహార్‌ లో మద్యపాన నిషేధం కోసం ఎప్పటి నుంచో మహిళా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. బీహార్‌ లో విచ్చలవిడిగా లభించే మద్యం - గుడుంబా వేలాది కుటుంబాలను రోడ్డున పడేశాయి. రాజకీయ పార్టీల అండదండలతో లిక్కర్‌ మాఫియా బీహార్‌ లో చెలరేగిపోయింది. పల్లెల్లో రహస్యంగా కల్లు - గుడుంబా తయారు చేయడం కొత్తేమీ కాదు. ఇలాంటి పరిస్థితుల్లో నితీశ్‌ కుమార్ సాహతోపేతంగా తీసుకున్న నిర్ణయం ఆర్థిక‌ - సామాజిక అంశాల కోణంలో ఎంత వరకూ అమలవుతుందనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

నితీశ్‌ కుమార్ నిర్ణయంతో లిక్కర్ తయారీ కంపెనీల షేర్లు దారుణంగా దెబ్బతిన్నాయ్. యునైటెడ్ స్పిరిట్స్ - యునైటెడ్ బ్రెవరీస్‌ - రాడికో ఖైతాన్ లాంటి లిక్కర్ కంపెనీలపై ఆ ప్రభావం పడింది. ప్రస్తుతానికి గుజరాత్‌ - కేరళ - మణిపూర్‌ - నాగాలాండ్‌ లో మాత్రమే మద్యపాన నిషేధం అమలవుతుంది. సమర్థంగా లిక్కర్ అమ్మకాలను అడ్డుకోగలగడం నితీశ్‌ కు కత్తిమీద సాము వ్యవహారమే. అయితే మాట‌పై నిల‌బ‌డే త‌త్వానికి పెట్టింది పేరు అయిన నితీశ్ ఈ స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మిస్తార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. మ‌ద్య‌పాన నిషేధం విష‌యంలో ప్ర‌జ‌ల‌ను చైత‌న్యవంతుల‌ను చేసి త‌ద్వారా గుడుంబా - క‌ల్తీక‌ల్లును అరిక‌డ‌తార‌ని అంచ‌నా వేస్తున్నారు. మ‌రోవైపు ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు ప‌లు కొత్త నిర్ణ‌యాలు తీసుకుంటార‌ని త‌ద్వారా ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తార‌ని చెప్తున్నారు.