Begin typing your search above and press return to search.

సోనియమ్మ అల్లుడు మామూలోడు కాదండోయ్

By:  Tupaki Desk   |   31 May 2016 7:41 AM GMT
సోనియమ్మ అల్లుడు మామూలోడు కాదండోయ్
X
దేశంలో మరెవరికీ దక్కని రాజభోగం సోనియమ్మ అల్లుడికే దక్కిందని చెప్పాలి. 130 కోట్ల భారతంలో మరే కుటుంబానికి దక్కని గౌరవం.. మర్యాద.. ప్రాధాన్యత ‘గాంధీ’ కుటుంబానికి దక్కుతుందన్న విషయం తెలిసిందే. అలాంటి ఇంటికి అల్లుడైన వ్యక్తి హవా ఎంత నడుస్తుందన్న విషయంపై ఇప్పటికే పలు ఆరోపణలు తెర మీదకు రావటం తెలిసిందే.

ప్రియాంకాగాంధీ భర్తగా దేశానికి పరిచయమైన రాబర్ట్ వాద్రా తన వైఖరితో ‘వివాదాస్పద వ్యక్తి’గా రూపాంతం చెందిన సంగతి తెలిసిందే. పదేళ్ల యూపీఏ సర్కారులో సోనియమ్మ రిమోట్ ను ఆపరేట్ చేసినట్లుగా విమర్శలు ఉంటే.. ఆ రిమోట్ ను తనకు అనుగుణంగా మార్చుకోవటంలో అల్లుడుగారు సక్సెస్ అయ్యారంటూ కాంగ్రెస్ ప్రత్యర్థి పక్షాలు తరచూ ఆరోపణలు చేయటం తెలిసిందే.

ఉత్త మాటలకే పరిమితం కాకుండా అల్లుడిగారి లీలలకు సంబంధించిన కొన్ని ఆధారాలు బయటకు వచ్చి మరింత రచ్చ అయ్యింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఉన్న విమర్శలు సరిపోవన్నట్లుగా తాజాగా ఆయనకు సంబంధించిన ఒక బినామీ ఉన్నారంటూ కొత్త ఆరోపణ తెర మీదకు వచ్చింది. ఒక ఆయుధాల వ్యాపారి (సంజయ్ భండారి) వాద్రా కోసం లండన్ లో విలాసవంతమైన మ్యాన్షన్ ను కొనుగోలు చేసినట్లుగా కొన్ని ఆధారాలు ఈడీకి చిక్కినట్లుగా చెబుతున్నారు.

గత నెలలో సంజయ్ భండారికి చెందిన 18 ప్రాంతాల్లోని ఆయన ఆస్తులపై ఈడీ దాడులు చేపట్టింది. ఈ సందర్భంగా కొన్ని ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇలా స్వాధీనం చేసుకున్నపత్రాల్లో రాబర్ట్ వాద్రా పేరుతో పాటు.. ఆయనకు మాన్షన్ ను కట్టబెట్టినట్లుగా చెబుతున్న అంశానికి సంబంధించిన ఈమొయిల్స్ ఈడీ చేతికి చిక్కినట్లుగా చెబుతున్నారు. లండన్ లోని ఈ భవంతిని 2009లో రాబర్ట్ వాద్రాకు సంజయ్ భండారీ కొనుగోలు చేసి ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ వాదనల్ని కాంగ్రెస్ ఖండిస్తోంది. వాద్రాను టార్గెట్ చేసి మరీ ఇరికించాలని చూస్తున్నట్లుగా కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే.. వాద్రా మీద వచ్చిన ఆరోపణలపై కేంద్రం విచారణను ప్రారంభించటం గమనార్హం.