Begin typing your search above and press return to search.

తండ్రి ఫ్లెక్సీకి అంత్యక్రియలు చేసిన కొడుకు

By:  Tupaki Desk   |   9 Oct 2015 4:49 AM GMT


కొన్ని కొన్ని అంశాలు చాలా చిత్రంగా ఉంటాయి. వినటానికి నిజమా అనిపించినా.. పరిస్థితులు అదే రీతిలో ఉంటాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో తన తండ్రి ఫ్లెక్సీ కి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు చేసి.. పిండప్రదానం చేసిన ఉదంతం పలువురి నోట చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణమైన అంశాలు ఔరా అనిపించక మానవు.

కూరగాయల వ్యాపారి సత్యనారాయణ గురువారం ఉదయం మరణించారు. అయితే.. సత్యనారాయణ భార్య.. పెద్ద కుమారుడు క్రైస్తవాన్ని స్వీకరించారు. చిన్న కొడుకు మాత్రం హిందువుగానే ఉండిపోయాడు. తండ్రి మరణంతో అంత్యక్రియలు ఎలా నిర్వహించాలన్న విషయంపై విభేదాలు చోటు చేసుకున్నాయి. ఎవరి మతాచారం వాళ్లు అంత్యక్రియలు నిర్వహించాల్సిందేనని పట్టుబట్టారు. చివరకు.. పెద్ద కుమారుడు.. సత్యనారాయణ భార్య క్రిస్టియన్లు కావటంతో ఆ తీరులోనే అంత్యక్రియలు పూర్తి చేయాలని నిర్ణయించారు. దీన్ని జీర్ణించుకోలేని చిన్న కుమారుడు.. తన తండ్రి ఫోటోతో భారీ ఫ్లెక్సీని తయారు చేయించారు.

దాన్నే పాడె కట్టి.. దండలు వేసి.. హిందూ శ్మశాన వాటికలో శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం పిండ ప్రదానం చేశారు. ఫ్లెక్సీతో అంత్యక్రియలు నిర్వహించటం సంగతి టాక్ ఆఫ్ ద టౌన్ అయినా.. తండ్రికి సంబంధించి ఇద్దరు కొడుకులు వేర్వేరుగా అయినా పద్ధతిలో ఎలాంటి తేడా రాకుండా అంత్యక్రియలు నిర్వహించటం విశేషంగా చెప్పుకుంటున్న పరిస్థితి.