Begin typing your search above and press return to search.

త్వరలో పండ్ల రేట్లు పెరుగుతాయా?

By:  Tupaki Desk   |   30 July 2015 6:06 PM GMT
త్వరలో పండ్ల రేట్లు పెరుగుతాయా?
X
నవ్యాంధ్రతోపాటు తెలంగాణలో కూడా త్వరలో పండ్ల రేట్లు పెరుగుతాయా? పండ్లకు కొరత వస్తుందా? ఈ ప్రశ్నలకు కారణం.. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలోని తోటలను కొట్టి వేయడమే. రాజధాని ప్రాంతంలో 50 వేల ఎకరాలకుపైనే వివిధ తోటలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జరీబు భూముల్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ భూములను రాజధానికి ఇచ్చేయడంతో జరీబు రైతులు తాము పండిస్తున్న పండ్ల తోటల్లో నీటి పైపులు, మోటార్లను స్వచ్ఛందంగా తొలిస్తున్నారు. తోటలను చదును చేసి ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు.

అరటి, చెరకు, బొప్పాయి, మొక్కజొన్న, నిమ్మ, జామ తదితర తోటలు రాజధాని ప్రాంతంలో ఉన్నాయి. వీటిలో కొన్నిటిలో పంట చివరి దశకు రావడంతో తోటలను ఖాళీ చేస్తున్నారు. వాటిలోని మంచినీటి పైపులను తీసేసుకుని ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. జరీబు భూములున్న తొమ్మిది గ్రామాల్లో సగానికిపైగా తోటలు ఇప్పటికే ఖాళీ అయ్యాయి. రాజధాని గ్రామాల్లో అరటి 5000 ఎకరాలు, మొక్కజొన్న 11 వేల ఎకరాలు; చెరకు ఐదు వేల ఎకరాలు, కంద వెయ్యి ఎకరాలు పండిస్తున్నారు. దాదాపు 50 వేల ఎకరాల్లో వివిధ పండ్లను పండించే తోటలను ఖాళీ చేసేస్తుండడంతో రాబోయే రోజుల్లో వీటికి కొరత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆయా తోటలను మరొకచోట వేసుకునే వరకూ ఎంతెకొంత కొరత వస్తుందని రైతులు వివరిస్తున్నారు.